- సునామా వెల్త్ మేనేజ్మెంట్ పేరుతో వల..
- సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిథిలో ఘటన..
నువామా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులమని చెప్పి సైబర్ మోసగాళ్లు రూ.10 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న మహిళను తనిష్కా సన్యం పేరుతో ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. నువామా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన ప్రతినిధినని చెప్పి ఇందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. అతడి సూచనల మేరకు ఆమె 2025 ఆగస్టు 8న ‘హిమాలయన్ ఎంటర్ ప్రెజెస్’ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాకు రూ.5 లక్షలు జమ చేసింది.
అనంతరం 2025 ఆగస్టు 12న ‘న్యూ ఎక్సక్లెంట్ ఫుట్వేర్’ పేరుతో ఉన్న మరో ఖాతాకు మరో రూ.5 లక్షలు బదిలీ చేసింది. మొత్తం రూ.10 లక్షలు చెల్లించిన తర్వాత ఆమె ఖాతా బ్లాక్ కావడంతో పాటు మోసగాడి వాట్సాప్ నంబర్ కూడా పనిచేయకుండా పోయింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ లేదా సోషల్మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
