జీహెచ్ఎంసీలో అవినీతి చక్రవర్తి షేక్ సనావుద్దీన్?
నిబంధనలకు తూట్లు. అక్రమార్కులకు అండగా కమిషనర్?
రాజకీయ సిఫారసులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆరోపణలు
వార్తా కథనాలు ప్రచురితమైనా.. డోంట్ కేర్ అంటున్న అవినీతిపరులు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC)లో నిబంధనలు(Rules) కాగితాలకే పరిమితమవుతున్నాయా? అవినీతి (Corruption) ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల విషయంలో చట్టం కంటే రాజకీయ సిఫారసులకే ప్రాధాన్యం దక్కుతోందా? అనే సందేహాలు ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Executive Engineer) షేక్ సనావుద్దీన్పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, పూర్తి ఆధారాలతో వార్తా కథనాలు కూడా ప్రచురితమయ్యాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని డిప్యుటేషన్ నుంచి మాతృ సంస్థకు పంపాలని గతంలోనే అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు. మాతృ సంస్థ కూడా సిబ్బంది కొరత ఉందని లేఖ రాసినప్పటికీ ఆ ఆదేశాలు అమలుకాకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఆదేశాలు బేఖాతరు.. రాజకీయ సిఫారసులకే పెద్దపీట?..
ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్జన్.. షేక్ సనావుద్దీన్ డిప్యుటేషన్ని మరో ఏడాది పొడిగించినట్లు(Extension of Deputation) ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పొడిగింపునకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi) సిఫారసు(Recommendation) లేఖను కారణంగా చూపారని ప్రచారం జరుగుతోంది. ఒక ఐఏఎస్ అధికారి పరిపాలనను నియమ నిబంధనల ప్రకారం నడపాల్సిన బాధ్యత ఉండగా రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నిర్ణయాలు తీసుకుం టున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బదిలీ ఉత్తర్వులకు విలువ లేదా?
ఇటీవల జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిళ్ల పరిధిలో భారీ బదిలీలు చేపట్టారు. ఇందులో భాగంగా చాంద్రాయణగుట్ట సర్కిల్ నుంచి షేక్ సనావుద్దీన్ను చార్మినార్ సర్కిల్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ ఆయన ఇంకా పాత స్థానంలోనే కొనసాగుతున్నారని సమాచారం. బదిలీ ఉత్తర్వులు అమలుకాకపోవడం వెనక కారణాలేంటి? కమిషనర్ సంతకానికి విలువ లేదా? సనావుద్దీన్కు నిబంధనలు వర్తించవా? అంటూ ఉద్యోగుల్లో, ప్రజల్లో చర్చ జరుగుతోంది.
ముందే హెచ్చరించిన వార్తా కథనాలు
ఇదివరకే ‘ఆదాబ్ హైదరాబాద్’ వంటి మీడియా సంస్థలు ఈ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆధారాలతో కథనాలు ప్రచురించాయని పేర్కొంటున్నారు. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ కథనాలకు బలం చేకూర్చుతున్నాయని విమర్శకులు అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని పంపించాల్సింది పోయి పట్టుబట్టి కొనసాగించడం వెనక ఉన్న కారణాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరుగుతోంది.
ప్రజాస్వామ్యమా? పైరవీల పాలనా?
చట్టాన్ని కాపాడాల్సిన ఉన్నతాధికారులే నిబంధనలను పక్కన పెడితే పరిపాలనపై ప్రజల విశ్వాసం ఎలా నిలుస్తుంది? ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే నిజాయితీగల అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్జన్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని పలు వర్గాలు కోరుతున్నాయి. లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చ సాగుతోంది.
