పెట్టుబడుల సాధనకు ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన
పారిశ్రామికవేత్తలతో రోడ్ షో, ప్రవాస తెలుగు ప్రజల సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు
విశాఖ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి
యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటన(UAE Tour)కు బయలుదేరారు. బుధవారం ఉదయం అమరావతి (Amaravati) నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకి బయలుదేరతారు. విశాఖ(Vishaka)లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశవిదేశాల పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. దీంట్లో భాగంగా యూఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అలాగే ఓ సైట్ విజిట్(Site Visit) చేస్తారు. ఈ సైట్ విజిట్లో భాగంగా దుబాయ్ (Dubai) ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. ఇవాళ మొత్తం ఐదు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే రాత్రి సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్లో జరగనున్న తెలుగు డయాస్పోరా (Telugu Diaspora) సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు.
