- రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధ్యయన కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా అవగాహన
- అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. BR Ambedkar Open University).. TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్(Job Achiever Business Operations Executive Programme) విద్యార్థులకు బంగారు బాట వేయనుందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి(VC Professor Ghanta Chakrapani) చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపిందించిన TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ను ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ చేపట్టిన ఈ సరికొత్త ప్రోగ్రాం గురించి తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధ్యయన కేంద్రాల్లో సిబ్బందికి, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు TCS iONతో కలిసి ఈ కోర్సును అందించటం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ వర్సిటీలో చదివే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యేలా తీర్చిదిద్దుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే ఏక కాలంలో పూర్తి చేయొచ్చని చెప్పారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో అనేక సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని, వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందని అందులో wehub, RASCI, శ్రీ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. వృత్తి, నైపుణ్య-శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థులకు రానున్న రోజుల్లో విస్తృత అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని ఘంటా చక్రపాణి వివరించారు.
