- బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించబోతుంది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుతో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్‘ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
బీజేపీ కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో కమ్యూనిస్టు కంచుకోట కేరళ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందని గుర్తు చేశారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేస్తున్నా, మహిళా మోర్చా కార్యకర్తలపై అత్యాచారం చేసినా వెనకంజ వేయకుండా అక్కడి ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బెంగాల్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని చెప్పారు. హైకమాండ్ దృష్టి అంతా తెలంగాణపైనే ఉందని.. త్వరలో కేంద్రీకృతం చేయబోతోందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
