జాతీయ రాజ్యాంగ దినోత్సవం (National Constitution Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Union Government), తెలంగాణ న్యాయ శాఖ (Telangana Law Ministry) సంయుక్తాధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషలో ముద్రించిన భారత రాజ్యాంగం ద్విభాషా గ్రంథాన్ని (Bilingual Edition) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సమగ్రంగా తెలుగులో అందించడం అభినందనీయమన్నారు.
రాజ్యాంగం తెలుగు భాషలో ప్రచురించడం వల్ల భాష, సంస్కృతిని కాపాడటంతోపాటు భావితరాలు, మేథావులు, సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. తెలుగులో తర్జుమా చేసి సమగ్రంగా రాజ్యాంగాన్ని తెలుగు–ఇంగ్లిషు ద్విభాషలో అందించడం వల్ల అనేక విషయాల్లో స్పష్టత ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా.. తెలుగువారికి, సామాన్యులకు సులభంగా రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవడానికి వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ కార్యదర్శి పాపిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
