- అవినీతి కేసులో ఈ చర్యలు తీసుకున్నామన్న అధికారులు..
నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దూబేకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అవినీతి కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. బహదూర్ దూబే వయసు 79 ఏళ్లు. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. తనతో పాటు తన కుటుంబంపై మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తన కుటుంబ ప్రాపర్టీపై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
దూబే భార్య, మాజీ విదేశాంగ మంత్రి అర్జూ రాణా దూబేకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఖాఠ్మాండు కోర్టు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనీల్యాండరింగ్ శాఖ ఓ కేసులో దూబేను విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దూబే దంపతులు సింగపూర్లో ఉన్నట్లు ఇటీవల నేపాలీ మీడియా పేర్కొన్నది. అయితే ఇంటర్పోల్కు నోటీసు ఇవ్వాలని పోలీసులు చూస్తున్నారు.
నేపాల్లో నెల క్రితం 35 ఏళ్ల ర్యాపర్, పొలిటీషియన్ బాలేంద్ర షా ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన అరెస్టు వారెంట్ జారీ చేయించినట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రధానిగా దూబే అయిదు సార్లు గెలిచారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. నేపాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు తన జీవితాన్ని త్యాగం చేసినట్లు ఆయన చెప్పారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అణిచివేసిన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోంశాఖ మంత్రి రమేశ్ లఖక్ను కూడా గత నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమ సమయంలో. దూబే ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఆ దంపతులపై దాడి చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆయన ఇంటి నుంచి నోట్ల కట్టల్ని నిరసనకారులు తీసుకెళ్లారు.
