ప్రవాసాంధ్రుల(NRIs) ఆత్మీయతకు దుబాయ్ (Dubai) వేదికగా నిలిచింది. తెలుగు ఎన్నారైల ఆహ్వానం మేరకు దుబాయిలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో ఏపీ జల వనరుల శాఖ మంత్రి(AP Water Resources Minister) డాక్టర్ నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu), టీడీపీ పాలిట్బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ పాల్గొనున్నారు. దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్న వీరికి ఏపీఎన్నార్టీఎస్(Apnrts)–ఎన్నారై డివిజన్, దుబాయ్ వెల్ఫేర్ అసోసియేషన్(Dubai Welfare Association) ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. తొలి రోజు దుబాయ్ ‘ది ఫస్ట్ కలెక్షన్’ బిజినెస్ హోటల్లో నిర్వహించిన ‘గ్రీట్ అండ్ మీట్’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీ జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
2వ రోజు ఆదివారం దుబాయ్ తెలుగు మైనార్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా అబుదాబిలో మంత్రి నిమ్మల రామానాయుడికి తెలుగు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. అక్కడ నివసిస్తున్న ప్రవాసులు ఆయనను ఆత్మీయంగా కలిసి అభిమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సమర్థ నిర్వహణపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రవాసులు ప్రశంసించారు. వారి సమస్యలు, సంక్షేమ అంశాలపై మంత్రి ఆసక్తిగా స్పందిస్తూ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని హృదయపూర్వకంగా కోరుకుంటున్న ప్రవాసుల భావోద్వేగాలను మంత్రి గుర్తించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రధాని మోదీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ ఉపయోగపడేలా అమలవుతున్నాయని మంత్రి వివరించారు. మంత్రి నిమ్మల రామానాయుడితో జరిగిన ఈ భేటీ ప్రవాస తెలుగు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా రాష్ట్రంతో తమ అనుబంధాన్ని మరింత బలపరిచిందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
