ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం 233వ, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(SLBC) ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటన ముగించుకొని ఇవాళ ఏపీకి చేరుకున్న చంద్రబాబు.. వచ్చీ రావడంతోనే నేరుగా ఎస్ఎల్బీసీకి హజరయ్యారు. వార్షిక రుణ ప్రణాళిక(Annual Loan Plan) అమలుపై సమీక్ష(Review Meeting) సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాలపై సమీక్షించనున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా బ్యాంకర్లు ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చారు. కౌలు రైతులకు రూ.1490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందజేశారు.
ఎంఎస్ఎంఈలకు రూ.95,714 కోట్లమేర రుణాలను జారీ చేశారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్(Amaravathi Financial Hub) చేసే అంశంపై చర్చించనున్నారు. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంశంపై బ్యాంకర్లతో సమాలోచనలు చేయనున్నారు. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల లింకేజీ, కేంద్ర పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్లకు సహకారం వంటి అంశాలపై సీఎం సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు హాజరయ్యారు.
