మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంగన్వాడి 1-2 కేంద్రం ఉదయం 10 గంటల వరకు తెరవకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రం పనిచేయాల్సి ఉండగా, సమయపాలన పాటించకపోవడంపై వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల హెచ్చరికల అనంతరం అంగన్వాడి సిబ్బంది హడావుడిగా వచ్చి కేంద్రాన్ని తెరిచినట్లు స్థానికులు తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అలాగే గ్రామంలో అంగన్వాడి కేంద్రాలు రెండు ఉన్నప్పటికీ, ఒకే భవనంలో రెండు కేంద్రాలను నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.ఈ విషయాన్ని గతంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలని మండల ప్రజా పరిషత్ అధికారికి జిల్లా ఉన్నతాధికారులు సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు.
అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఒకే భవనంలో రెండు కేంద్రాలు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడి 1, అంగన్వాడి 2 కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేసి నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
