- ఏ.ఐ –క్వాంటం ఆధారిత ఉన్నత విద్యపై చర్చలు
- 100 మందికి పైగా ఉపకులపతులు హాజరు
- స్వదేశీ ఏ.ఐ రూపకల్పనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పిలుపు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) ఆధ్వర్యంలో రెండవ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు గురువారం నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం లో 2025–26 ఘనంగా ప్రారంభమైంది.ఏ.ఐ క్వాంటం టెక్నాలజీ ఆధారిత ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సుకు ఆరు రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా ఉపకులపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సదస్సును ప్రారంభించిన అనంతరం తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఏ.ఐ–క్వాంటం సమన్వయం విద్యా రంగానికి కీలకమని పేర్కొన్నారు.
భారతీయ నైతిక విలువలకు అనుగుణంగా స్వదేశీ ఏ.ఐ పరిష్కారాలు అభివృద్ధి చేయాలని సూచించారు.ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ స్వాగతోపన్యాసంలో విద్యార్థులను భావి సాంకేతిక ప్రపంచానికి సిద్ధం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.విద్యావేత్తలు ‘ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్’గా మారి సమాజ అవసరాలకు అనుగుణంగా జ్ఞానాన్ని ఆవిష్కరించాలన్నారు.

ఉస్మానియాలోని,సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (CoE-AIML)’ను స్మార్ట్ సిటీలు,మేధో రవాణా వ్యవస్థలు,విశ్వసనీయ ఆరోగ్య సేవలు,మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జాతీయ స్థాయి హబ్గా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమాలు ఇండియా ఏఐ మిషన్, వికసిత్ భారత్–2047, స్మార్ట్ సిటీస్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి పారిశ్రామిక అవసరాలకు సరిపడేలా AI–క్వాంటం ఆధారితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.ఈ సందర్భంగా ‘యూనివర్శిటీ న్యూస్’ ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. ఏ.ఐ.సీ.టీ. ఈ,నాక్,ఐకార్ ప్రతినిధులతో పాటు డీన్లు,ప్రిన్సిపాల్స్,డైరెక్టర్లు,అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపులో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నరేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
