- నాంది పలుకనున్న ది కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు..
- మేకింగ్ కు ముందే క్యూరియాసిటీ కలుగజేస్తున్న ప్రాజెక్ట్..
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రాపగాండ సినిమా అని, కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఒకవైపే చెప్పారని ఎన్ని కామెంట్లు వచ్చినా.. జనాలు మాత్రం ఎగబడి మరీ సినిమా చూశారు. దక్షిణాదిన పెద్దగా ఆడలేదు కానీ.. ఉత్తరాదిన మాత్రం దాదాపు నెల రోజుల పాటు చాలా చోట్ల హౌజ్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక అలాంటి హిట్టు సినిమా తర్వాత ది వాక్సిన్ వార్ అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అగ్నిహోత్రి. ఈ సినిమా తొలివారమే టప్పా కట్టేసింది. నిజానికి ఈ సినిమాకు రివ్యూలు పాజిటీవ్ గానే వచ్చాయి. అయితే చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన కరోనా మహమ్మారి కాన్సెప్ట్తో సినిమా అనే సరికి ఎవ్వరిలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా ఫైనల్ రన్లో పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇక ఈ సారి మహాభారతం వంటి ఎపిక్ స్టోరీని సినిమాగా తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు. అత్యధికంగా అమ్ముడయన నోవెల్గా ప్రసిద్ధిగాంచిన పర్వను బేస్ చేసుకుని వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పల్లవి జోషి నిర్మాత. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నట్లు టాక్. అంతేకాకుండా దాదాపుగా ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ సినిమాల్లోని నటీనటులనే ఈ ప్రాజెక్ట్లో తీసుకోబోతున్నారట. మహాభారతం వంటి ఎపిక్ డ్రామా సినిమాగా రూపొందుతుందంటే అందరిలోనూ తీవ్ర అంచనాలు నెలకొంటాయి. మరి ఆ అంచనాలను వివేక్ అగ్నిహోత్రి అందుకుంటాడా లేదా చూడాలి.