58,204 మంది కోసం రూ.75 కోట్లు
మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి
బాల్య వివాహ రహిత ఏపీ పోస్టర్ ఆవిష్కరణ
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5జీ మొబైల్ ఫోన్ల(Cell Phones)ను అందిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి (minister Gummadi Sandhyarani) తెలిపారు. ఎన్టీఆర్ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,204 మంది కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను అందించే కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు రూ.75 కోట్ల వ్యయంతో మొబైల్ ఫోన్లను పంపిణీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4జీ ఫోన్లు సరిగ్గా పనిచేయలేదని, అందుకే కూటమి ప్రభుత్వం 5జీ నెట్ వర్క్ ఫోన్లు అందిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 55,204 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు లక్షా 25 వేల మంది సేవలు అందిస్తున్నారన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలను అందంగా అలంకరించటానికి ‘ముస్తాబు’ (Mustabu) అనే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాల్య వివాహ రహిత ఏపీ (Child Marriage-Free AP) పోస్టర్ను ఆవిష్కరించారు (Poster Release). ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కె.ప్రవీణా, జిల్లా ఇన్ఛార్ట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
