Sunday, September 8, 2024
spot_img

దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు చెల్లు..

తప్పక చదవండి
  • నిరంకుశ పాలనకు ఇక చరమగీతం..
  • జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం..
  • తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

హైదరాబాద్‌ :
కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల గత కొన్నిరోజులుగా ఎటు చూసినా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలి ఎన్నికల పరిశీలనపై కమిటీని సైతం ఏర్పాటు చేశారు. దేశంలో రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకుని రాజ్యం ఏలాలనుకుంటున్న మోడీకి, కేసీఆర్ లకు భంగపాటు తప్పదని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ ఇద్దరికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలని
అభిప్రాయపడ్డారు. మోడీ, కేసీఆర్ ల నియంతృత్వం పరాకాష్టకు చేరిందన్నారు. వీరికి ప్రజలకన్నా తమ అధికారమే ముఖ్యమన్న భావనలో ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా, జమిలి ఎన్నికలయినా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీ.ఆర్.ఎస్. మట్టి కరవడం ఖాయమని రేవంత్ అభిప్రాయపడ్డారు.

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, దీనికి తాము పూర్తి వ్యతిరేకం అన్నారు రేవంత్.. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే జమిలి విధానాన్ని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తెర విూదకి తెచ్చిందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాలరాయడానికే జమిలి ఎన్నికలను బీజేపీ సర్కార్‌ తెస్తోందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కానీ అన్ని రాష్టాల్ల్రో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ వాళ్ల మాయలో ప్రజలు పడే పరిస్థితి లేదని, అందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రులు గల్లీ గల్లీ తిరిగినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని గుర్తు చేశారు. నెల రోజులపాటు బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు కర్ణాటకను చుట్టేసినా కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు రావడం నిజం కాదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మణిపూర్‌ అంశంపై మాత్రం ప్రధాని మోదీ పార్లమెంట్‌ లో నోరు విప్పలేదు, కానీ జమిలి ఎన్నికలు అంటూ రాష్ట్రాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. కానీ ఆ 5 రాష్టాల్ర ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీ అని పలు సర్వేలలో తేలిందన్నారు. అత్యధికంగా కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తున్నాయని, బీజేపీ 31 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం.. వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ పేరుతో జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఇండియా కూటమికి బలం పెరగడంతో పాటు ఆదరణ పెరగడంతో జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిందని, దీనికి తాము పూర్తి వ్యతిరేకం అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ జమిలి ఎన్నికల కమిటీ సభ్యుడిగా అధీర్‌ రంజన్‌ వైదొలగడం తెలిసిందే. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకేగూటి పక్షులను.. అందుకే గూలాబీ పార్టీ జమిలిని స్వాగతించే అవకాశం ఉందన్నారు. గతంలో 2018లో జమిలి ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ సమ్మతి తెలుపుతూ లేఖ రాశారని గుర్తుచేశారు. కానీ ఇలాంటి ఎన్నికలతో రాష్ట్రాల అధికారాన్ని హరించి వేస్తాయని, కేంద్రం చేతుల్లోకి అధికారం వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్‌ తీరు గమనిస్తే అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే జమిలిని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాలరాసే అవకాశం అధికంగా ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు