Sunday, September 8, 2024
spot_img

కాలం కాటేస్తె..

తప్పక చదవండి

ఒళ్ళంతా ఒకటే నొప్పులు, కాలు కదల్చితే మోకాళ్ళ నొప్పులు, వంగుతుంటే నడుం నొప్పి, కొద్దిగా ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే కడుపు నొప్పి, తలనొప్పి. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. అవునులే నా వయసిప్పుడు పదహారే అనుకుంటున్నానో…ఏమో…! డెబ్భై అయిదు సంవత్సరాలు వచ్చాయి అది మరచిపోతే ఎలా అని అనుకున్నాను. ప్రస్తుతం ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తుంది. పని మనిషి వచ్చి వంట వార్పు చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి నిన్న మొన్నటి పప్పు మిగిలితే రసంలో వేసేస్తుంది. ఇంకోసారి రసం లో పప్పు కలబోసేసేది. ఆ వంటలు రుచి కూడా ఉండవు. గతిలేక అవే వంటలు తినాల్సి వస్తుంది. ఇక బయటి ఆహారం కల్తీల మయం. అసలే ఒంట్లో షుగర్‌ ఉంది బయటి ఆహారం తినలేను. ఏదో పనిమనిషి చేసింది తినేసి కొడుకుకి,కోడలికి ఫోన్‌ చేసి మాట్లాడేవాణ్ణి. ఈ మధ్య వాళ్ళు కూడా ఏ రాత్రుల్లో ఒక రెండు మాటలు మాట్లాడేసి పెట్టేస్తున్నారు. ఇక నా కూతురు అల్లుడు కూడా అదే మాదిరి, ఎప్పుడు చూడు బిజీ.ఏమి కాలమో ఇది? బాగున్నావా నాన్న అని కూడా అడగరు. తీరికలేని వాళ్ళ ఉద్యోగాలతో నేనున్నానని కూడా మర్చిపోతున్నారు. ఇక మిగిలిన సమయమంతా ఇంటికి దగ్గర్లో ఊడల మర్రి చెట్టుకింద నా మిత్రులతో రోజూ కలుసుకుంటుంటాను. అలాగైనా నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు అని.అవును ఒంటరివాడిని చేసి కాలం చేసింది నా భార్య మైత్రి. నాకు పెళ్లయిన మొదట్లో చాలా చులకనగా తనను చూసేవాణ్ణి.అలా కొద్దిరోజులకి మా ఆవిడని వంటింటికి పరిమితం చేసేసాను. తను కూడా పదవ తరగతి వరకు చదువుకుంది అయినా నా పురుషాహంకారంతో తనని ఏ ఉద్యోగం చెయ్యనివ్వలేదు. నేనేమో ఉద్యోగానికెళ్లి ఇంటికి తిరిగి వచ్చేవాడ్ని. ప్రభుత్వ ఉద్యోగమాయె ఇక మా ఆవిడ ఉద్యోగం ఎందుకు చెయ్యాలి అని మందలించి ఇంట్లోనే ఉండమని చెప్పాను. తెల్లవారుతుండగానే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసి, వంటలు చేసి అన్నీ సిద్ధం చేసి ఉంచేది. ఆ కల్మషం లేని ప్రేమని ఇప్పుడు పొందలేకపోతున్నందుకు బాధపడుతూనే ఉన్నాను. ఏమీ చెయ్యాలి తనా ఒంటరిని చేసింది. పిల్లలు వారి వారి జీవితాలతో బిజీ బిజీ. వాళ్ళ ఇంటికి పోయి ఉందామంటే కుదరదు అంటారు అదే నా మైత్రి బ్రతికే ఉంటే తనని తీసుకెళ్ళేవారేమో…! ఏదో ఒక పని చేసిపెడ్తది కదా అని. అయినా బ్రతికి ఉన్నప్పుడు తెలియని విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. ‘‘మైత్రి’’ ఏనాడు నాకు ఎదురు చెప్పలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా చెప్పేది కాదు. నా మనసును ఎప్పుడూ కష్టపెట్టలేదు. కానీ నేనే అప్పుడప్పుడు తాగి వచ్చి ఆ మైకంలో కొట్టేవాడ్ని. తనని ఒక మనిషిగా కూడా గుర్తించలేదు. ఒక బానిసలా భావించాను అప్పుడే అర్థాంగిగా గుర్తించి ఉంటే తనకు వచ్చిన జబ్బు గురించి అయినా చెప్పి ఉండేది.తను తగ్గుతున్నా, జ్వరం తో ఉన్నా పట్టించుకోలేదు.దాంతో పాటు ఊపిరితిత్తుల సమస్య ఉందని తెలీనియ్యలేదు. మలేరియా తో బాధపడుతున్న తను చివరి నిమిషంలో కూడా నాకు ఒక్క మాట చెప్పలేదు,దానికి కారణం కూడా నా ప్రవర్తనే. తనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు బాధపడతూనే ఉన్నాను ఎప్పుడూ ఒకప్పటి జీవిత పొరపాటు నాకు గ్రహపాటైంది.ఇప్పుడు గుణపాఠమైంది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం. అప్పుడే కళ్ళు తెరవాల్సింది నేను. ఇప్పుడు తినడానికీ కష్టమే, నడవడానికీ కష్టమే, ఏదైనా జరిగరానిది నాకు జరిగితే చూసే నాథుడే లేడు. ఇదే కాబోలు కాలం కాటువెయ్యడం అంటే. చేసిన తప్పులకి కాలమే శిక్షిస్తుంది. మైత్రి జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా! తను లేని లోటు మాత్రం ఎవ్వరూ తీర్చలేనిది.ఎన్నోసార్లు నా స్నేహితులు వాళ్ళ భార్యల గురుంచి గొప్పగా చెప్తుంటే నా మీద నాకే అసహ్యమేసేది నా ప్రవర్తనకి అలాగే బాధేసేది. నా జీవితం ఎలాగూ నాశనం చేసుకున్నా, ఇల్లాలిని దూరం చేసుకుని. ఇప్పుడు నూతన దంపతులు కనపడితే చెప్తూ ఉంటాను. మీరు నాలాగా మారొద్దండి అని. నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి అని. మీ ఇంటి మహాలక్ష్మిని కంట నీరు పెట్టించకండి. చివరి వరకు ఈ జీవన యాత్రలో మిగిలేది జంటపక్షులే. పిల్లలకి రెక్కలు రాగానే ఎగిరిపోయి ఇంకో గూడుని చూసుకుంటారు.మిగిలేది మీరిద్దరే అని చెప్తూ ఉంటాను. నా కట్టె కాలే సమయం దగ్గరికి వచ్చినట్లుంది. ఎవరు వస్తారో, ఎవరు రారో. చివరకి పిల్లలు మేము రాలేము,చితి పేర్చి కాల్చివెయ్యండి అని చెప్తారో ఏమో… ఎవరికి ఎరుక…కాల మహిమ మరి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు