Sunday, September 8, 2024
spot_img

‘తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చొరవచూపాలి’ !

తప్పక చదవండి

ప్రజల కోసం పని చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించుకున్నది.రహదారులు దేశం ఆస్తులని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు.ఆల్ వెదర్ రోడ్లు ఆర్ధిక వృద్ధికి కీలకమైనవని ఏడీబీ(ఆసియా డెవలఫ్ మెంటు బ్యాంక్)ట్రాన్స్ పోర్ట్ స్పెషలిస్ట్ ఆండ్రీ హెరియా వాన్ అన్నారు.భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆల్ వెదర్ రోడ్ల నిర్మాణం గురించి ఏడీబీ $ 500 మిలియన్ల(రూ.4,156 కోట్లు)ఆర్ధిక అప్పును ఇచ్చింది.ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా అనుసంధానం లేని గ్రామాలకు రహదారి కనెక్టీవిటీని అందించడానికి దేశవ్యాప్తంగా 5,62,047 కిలోమీటర్ల కొత్త మరియు మెరుగైన గ్రామీణ రహదారులను నిర్మించినట్లుగా అధికారిక లెక్కలు చెప్పుచున్నవి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్లు, వి.సైదాపూర్ మండల కేంద్రానికి 4,చిగురుమామిడి మండల కేంద్రానికి 7, శంకరపట్నం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో దుద్దెనపల్లి గ్రామం ఉన్నది. గ్రామ పెద్ద చెరువు (పడాల చెరువు) 2021లో కురిసిన భారీ వర్షాల వలన మత్తడి దూకింది.మత్తడి నీళ్ల ప్రావాహాంతో దుద్దెనపల్లి నుండి మోగిలిపాలెం, రేకొండ గ్రామాలకు ప్రయాణించే “”ముడాగుల మొరం రోడ్ కు గండిపడింది.2001లో పనికి ఆహార పథకం కింద నిర్మించిన కల్వర్టు, పైపులు కొట్టుకుపోయాయి. మోగిలిపాలెం రోడ్డును, కల్వర్ట్ ను నిర్మించాలని గ్రామ సర్పంచ్, ఎం.పి.టి.సి,రైతుల సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని 2022 నవంబర్ 14 న నిర్వహించిన “‘ ప్రజావాణి””కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది.దానికి భవిష్యత్ ఉత్తరప్రత్యుత్తరాల గురించి “”ప్రజావాణి రిజిస్ట్రేషన్ నంబర్ కెఎ032/ఇ/2022/0006 తేది14/11/2022
రశీదును ఇచ్చారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒడితెల సత్తీశ్ కుమార్, కరీంనగర్ లోక సభ నియోజకవర్గ ఎం.పి బండి సంజయ్ కుమార్ క్యాంప్ ఆఫీస్ లో కూడా విజ్ఞాపన పత్రాలను ఇవ్వడం జరిగింది. కాని ప్రభుత్వ పరంగా ఏమి స్పందన రానందున మరల 2023 జనవరి 2న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా లేఖసంఖ్య ఎ5/ప్రజావాణి/2022 గా కేసు నమోదు చేసి పంచాయతీ రాజ్ శాఖ పరిశీలనకు ఉత్తర్వులను ఇచ్చారు. అప్పుడు కరీంనగర్ జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్ స్పందించి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ హుజురాబాద్ సబ్ డివిజన్ ను గండిపడిన కల్వర్టు ను,మొరం రోడ్ ను అధ్యయనం చేసి బడ్జెట్ అంచనా నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.2023 జనవరి 17న గండిపడిన రోడ్, కల్వర్టును పరిశీలించి రోడ్డు నిర్మాణ అంచనా బడ్జెట్ రూ.78.50 లక్షలు ఖర్చు అవుతుందని నెంబర్. డిబి/ప్రజావాణి/2023,తేది 21/1/2023 లేఖ ద్వారా జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్ కు నివేదించాడు.అట్టి నివేదికను దృవీకరించిన జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ లేఖ సంఖ్య ఎ5/ప్రజావాణి/2022 ,తేది30/01/2023 గల లేఖ ద్వారా “”కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు నివేదించారు.
పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన నివేదికపై జిల్లా పాలనాధికారిగా కలెక్టర్ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు.వ్యాసకర్త నైన నేను “”సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 4(1),(సి),(డి) ప్రకారంగా గండి పడిన కల్వర్టును, రోడ్ ను నిర్మించడానికి రూ.78.50 లక్షల బడ్జెట్ అంచనా ఇచ్చిన జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యల సమాచారాన్ని ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయ ప్రజా సమాచార అధికారిని అడిగాను.దానికి స్పందనగా సహాయ ప్రజా సమాచార అధికారి సహచట్టం 2005,సెక్షన్ 6(3) ప్రకారంగా లెటర్ నంబర్ హెచ్2/1539/2023 తేది 16/05/2023 ద్వారా జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ కు బదిలీ చేశాడు.
దానికి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ నెం.ఎ6/644/2023,తేది04/08/2023 లేఖ ద్వారా రోడ్ కల్వర్టు, మరమ్మతులకు రూ.78.50 లక్షలు మంజూరీ నిమిత్తం జిల్లా కలెక్టర్ కు ఇది వరకే సమర్పించామని తెలిపారు.కరీంనగర్ జిల్లా కలెక్టర్ పాలనాధికారిగా రోడ్డు మరమ్మతులకు రూ.78.50 లక్షల బడ్జెట్ ను కేటాయించే ప్రయత్నాలు చేయలేదు.హుస్నాబాద్ ఎమ్మెల్యే ,కరీంనగర్ ఎంపీ లు కూడా గండిపడిన మొరం రోడ్డును కనీసం చూడడానికి కూడా రాలేదు.స్వరాష్ట్రం తెలంగాణలో
సమస్యల సత్వర పరిష్కారం గురించి ప్రభుత్వం రూ.1.33 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు సకల సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించింది.అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యలపై అధికారులను పిలిపించుకుని సమీక్షించి పరిష్కరించే విధానం అమలుకావడం లేదు.
2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014 — 2015 వార్షిక బడ్జెట్ ను నవంబర్ 5 న రూ.1,00,637.96 కోట్లతో ప్రవేశపెట్టారు. అలాగే 2023 — 2024 వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 6 న రూ.2,90,396 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 వార్షిక బడ్జెట్ లలో రూ.17,78,277 కోట్లను కేటాయించింది.2023 —2024 బడ్జెట్ లో పంచాయతీ రాజ్ ,గ్రామీణ అభివృద్ధికి రూ.31,426 కోట్లు,రోడ్లు భవనాలకు రూ.22,260 కోట్లు
కేటాయించింది.కేంద్ర ప్రభుత్వం కూడా రహదారుల అభివృద్ధి, పురోగతిని పర్యవేక్షించడానికి ఆన్ లైన్ పర్యవేక్షణ మరియు అకౌంటింగ్ వ్యవస్ధను అభివృద్ధి చేసినట్లుగా ప్రకటించింది. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా పోగ్రాం కింద ఇ–గవర్నెన్స్ ,మొబైల్ అనువర్తనం ద్వారా ఫిర్యాదులను నమోదు చేసి అమలు చేస్తామని కూడా ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి గురించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 500 కంటే ఎక్కువ జనాభా,కొండ ప్రాంతాల్లో 250 కంటే ఎక్కువ జనాభా ఉన్న 1,78,000 ప్రాంతాలలో అన్నీ కాలల్లోనూ అనుకూలంగా ఉండే రహదారులను నిర్మించి అనుసందానం చేస్తామని తెలిపింది.1. 67 లక్షల అనుసంధానం కాని అవాసాలకు 3. 71లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులను నిర్మించుతామని, 3. 68 లక్షల కిలోమీటర్ల రహదారులను నవీకరణ చేస్తామని ప్రకటించింది.2022౼ 2023 ఆర్ధిక సంవత్సరంకు గాను గ్రామీణ రహదారుల నిర్మాణంకు రూ.19,000 కోట్లు కేటాయించినట్లుగా కూడా తెలిపింది.ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కు రూ.29,271 కోట్లు,జిల్లా,మండల పరిషత్ లకు రూ.500 కోట్లు కేటాయించినట్లుగా తెలిపింది.కాని ఆచరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ గ్రామీణాభివృద్ధికి తోడ్పడడం లేదు.రైతులకు,ప్రజలకు కనీస రవాణా,ప్రయాణ సౌకర్యంకై గండిపడిన రోడ్డును పూడ్చడం లేదు.

గండిపడిన దుద్దెనపల్లి ముడాగుల మోగిలిపాలెం మొరం రోడ్ ద్వారా గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి హుస్నాబాద్ వరకు ప్రైవేటు బస్ లు నడిచేవి. రేకొండ ఎగ్లాస్ పూర్ గ్రామాల మధ్యన ఉన్న తారు రోడ్ కు కనెక్టీవిటీ రోడ్ గా కూడా ఉన్నది.చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూరు మండల కేంద్రాలకు,గ్రామాలకు రవాణా సౌకర్యంగా ఉపయోగపడుచున్నది.అన్నింటి కంటే ముఖ్యంగా రైతులకు ప్రధాన రహదారీగా ఉపయోగపడుచున్నది. వ్యవసాయంలో ఎద్దు,నాగలి,బండి,పలుగు వినియోగం బందయింది.యంత్రాల వినియోగం పెరిగింది.వ్యవసాయ కూలీల కొరత కూడా పెరిగింది. మోటార్ వాహనాల రవాణా సౌకర్యం కల్పిస్తేనే కూలీలు పొలం పనులకు వస్తున్నారు.వ్యవసాయ రంగంలో రైతులకు రవాణా సౌకార్యం అత్యవసర మైంది.అందుగురించి గత మూడేండ్లుగా గండిపడిన కల్వర్టును, నీటి ప్రవాహానికి గుంతలు పడిన మొరం రోడ్డుకు మరమ్మతులు చేయడానికి పంచాయతీ రాజ్ ఇంజనీర్ నివేదిక ప్రకారంగా రూ.78.50 లక్షల బడ్జెట్ ను కేటాయింపచేసే ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించిన లేఖను 2023 సెప్టెంబర్ 6 న, రిజిస్టర్ పోస్టుల్లో పంపించడం జరిగింది.అట్టి రిజిస్టర్ పోస్ట్ అర్ఎన్ఐ(హిస్టరీ ఆఫ్ రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా) నంబర్ 85615835ఇన్, ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)నంబర్ 8278185615835.కాని ఇప్పటి వరకు ఏవిధమైన స్పందన రాలేదు.రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జోక్యం చేసుకుంటారని ఎదురుచూస్తున్నారు.కాబట్టి రాష్ట్ర అత్యున్నత కార్యనిర్వాహక అధికారిగా, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా,రాష్ట్ర క్యాబినెట్ ఎక్స్ అఫీషియో సెక్రెటరీగా చొరవ చూపి దుద్దెనపల్లి గ్రామ పడాల చెరువు మత్తడి నీళ్ల ప్రావాహాంతో గండిపడిన మోగిలిపాలెం ముడాగుల మొరం రోడ్డుకు రూ.78.50 లక్షల బడ్జెట్ ను కేటాయింప చేయాలని రైతులు పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

  • మేరుగు రాజయ్య, 9441440791.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు