Sunday, September 8, 2024
spot_img

కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వండి..

తప్పక చదవండి
  • తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ..
  • ఆరు హావిూ పథకాలు ప్రకటించిన సోనియా..
  • పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం..
  • 500లకే సిలిండర్‌ సరఫరా..
  • టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..
  • గృహలక్ష్మి కింద 200 యూనిట్ల కరెంట్‌ ఉచితం..
  • ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం..
  • ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ..

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలనేదే తన స్వప్నం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్టాన్న్రి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కొన్ని గ్యారెంటీలను ప్రకటించారు. ఈ గ్యారంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. మరికొందరు నేతలు మరిన్ని గ్యారంటీ స్కీమ్‌లను ప్రకటించారు. మహాలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. ఇంటి అవసరాల కోసం రూ.500 కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. రాజీవ్‌ యువ వికాసంలో భాగంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్‌ అభయ హస్తం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయింపు చేస్తామన్నారు. రైతుభరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చేలా ప్రణాళిక చేస్తామని అన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఫ్యామిలీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకొనే వెసులుబాటు విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. చేయూత పథకం కింద నెలకు వయసు పైబడిన వారికి రూ. 4 వేల చొప్పున పింఛను అందే ఏర్పాటు,రూ.10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా వచ్చేలా ప్రణాళిక ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్‌ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హావిూలను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హావిూలను ప్రకటించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ మహిళా ఓటర్లే మెయిన్‌ టార్గెట్‌ గా మెజారిటీ హావిూలు ప్రకటించినట్లు తెలుస్తోంది.

కాగా రెండు రోజులుగా హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణా హోటల్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సి.డబ్ల్యు.సి. సమావేశం ముగిసింది. తెంలగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ రెండు రోజుల సమావేశంలో లోతైన చర్చ జరిగిందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. బంగారు తెలంగాణ ఆశలను బీ.ఆర్.ఎస్. చిదిమేసిందని, ఆ ఆశలను తిరిగి జ్వలింపజేయాల్సిన అవసరం ఉందంటూ సి.డబ్ల్యు.సి. తెలంగాణ ప్రజలకు ఒక విన్నపం చేసింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను కోరింది.

- Advertisement -

మంత్రివర్గం ప్రమాణం చేసినరోజు నుంచే 6 గ్యారంటీలు అమలు : రాహుల్‌.
ధరణి పోర్టల్‌ పేరిట పేదల భూములను ప్రభుత్వం లాక్కొందన్నారు రాహుల్ గాంధీ. రైతుబంధు పేరిట భూస్వాములకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారని పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయటం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి 250 గజాల ఇంటిస్థలం ఇస్తామన్నారు. మోదీ సర్కార్‌ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యి చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామన్నారు. చేయూత కింద పింఛన్ నెలకు రూ.4000 చెల్లిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే మాట నిలబెట్టుకుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హామీలు నెరవేరుస్తుందన్నారు. మంత్రివర్గం ప్రమాణం చేసినరోజు నుంచే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు రాహుల్‌. బీజేపీ, బీజేపీ, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే అన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంటులో కేంద్రం పెట్టిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. పార్లమెంటులో బీజేపీ ఏం చెబితే దానికి బీ.ఆర్.ఎస్., ఎంఐఎం మద్దతిస్తాయన్నారు. మోదీ కనుసైగ చేయగానే బీ.ఆర్.ఎస్., ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయన్నారు.

తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్‌ 17 చరిత్రాత్మకమైన రోజు : ఖర్గే
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ 6 గ్యారంటీలను ప్రకటిస్తోందని తెలిపారు. రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15000 వేలు ఇస్తామన్నారు. పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు ఖర్గే.పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం తెచ్చింది కాంగ్రెస్‌ అన్నారు ఖర్గే. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదని.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు