టీటఎస్ఎస్పీడీసీఎల్ లో అనర్హులకు ఉద్యోగాలు
- ఉపసంహరించుకున్న జీవో ఆధారంగా జాబ్స్
- మిగతా వారీకి మొండిచెయ్యి
- సూత్రధారిగా పాత సీఎండీ రఘుమారెడ్డి
- సపోర్ట్ చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!
- హైకోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలు రాని అభ్యర్థులు
- కొత్త సీఎండీని కలిసి వినతి
- సమగ్ర నివేదిక ఇవ్వాలని కొత్త సీఎండీ ఆదేశాలు
- రఘుమారెడ్డి, పాత ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ లోని అవినీతి పందికొక్కుల లీలలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉన్నాయి. ఆ ప్రభుత్వంలోని ఆమాత్యులే కాదు కీలకమైన సంస్థల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, బాస్ లు సైతం నిబంధనలకు పాతరేసి.. అందికాడికి గట్టిగానే దండుకున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఓ జీవోను ఉపసంహరించుకోగా.. దాని ఆధారంగానే కొందరు క్షాంట్ష్రాక్ట్ ఎంప్లాయిస్ జాబ్స్ పొందడం విస్మయం కల్గిస్తోంది. అయితే అప్పట్లో కొందరు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కు జాబ్స్ ఇవ్వడంతో.. మరికొంత మంది తమకూ ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి టీఎస్ఎస్పీడీఎల్ సీఎండీని కోరగా.. తానేం చేయలేనని అసరమైతే మీరు కోర్టుకు వెళ్లొచ్చని ఉచిత సలహా ఇవ్వడం గమ్మత్తుగా ఉంది.
ఉమ్మడి ఏపీలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విద్యుత్ డిస్కంల్లో నియామకాలకు సంబంధించిన ఒక కీలకమైన జీవో 36ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అప్పట్లో గ్రామాల్లో విలేజ్ హెల్ పర్స్, డైలీ కూలీలు, కాంట్రాక్టర్ల వద్ద లేబర్స్ గా పనిచేసిన వారికి జూనియర్ లైన్ మెన్, టైపిస్ట్, ఎల్డీసీలుగా అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం అప్పటి ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారి నుంచి 50 శాతం మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగా 18-05-1997 నాడు అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 36ను విడుదల చేసింది.
ఇక 1997లో విడుదలైన జీవో 36 ఆధారంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో అన్ని జిల్లా సర్కిల్స్ లో నోటిఫికేషన్ మేరకు అభ్యర్థులు ఎగ్జామ్, ఇంటర్వ్యూ కోసం పిలవబడ్డారు. జూనియర్ లైన్ మెన్, టైపిస్ట్, ఎల్డీసీ, సబ్ ఇంజినీర్, పోస్టులకు ఎగ్జామ్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే అప్పట్లో ఇంటర్వ్యూ డేట్ నాడు ఎగ్జామ్, ఇంటర్వ్యూకు ఎవరైతే హాజరయ్యారో వారికి కాకుండా.. ఇతరులకు ఉద్యోగాలకు రావడం గమనార్హం. వీరిలో కొంత మంది నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు కొట్టేసే యత్నం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేసిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ను సబ్మిట్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా అనేక మంది అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాలు పొందారని వెల్లడిరచింది. దీంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా అప్పటి సీఎండీ సాయి ప్రసాద్ తప్పుడు పద్ధతుల్లో జాబ్స్ పొందిన వారికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిరాకరించారు.
రఘుమారెడ్డి సీఎండీ కావడం అక్రమార్కులకు వరంగా మారిన వైనం
తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా ఏర్పడిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు రఘుమారెడ్డి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే ఉమ్మడి ప్రభుత్వ హయాంలో పాత సీఎండీ సాయి ప్రసాద్ అక్రమార్కులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నిరాకరించబడిన వారు మళ్లీ తమ తమ స్థాయిల్లో పైరవీలు చేసుకొని టీఎస్ఎస్పీడీఎల్ లో ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇలాగే 2015లో మొదట మెదక్ సర్కిల్ లో రఘుమారెడ్డి మొదట ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. తర్వాత మరికొందరు కూడా ఉమ్మడి ఏపీలో విడుదలైన జీవో 36 ఆధారంగా తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరగా.. ఆ జీవో ఎప్పుడో 2006లోనే విత్ డ్రా అయినట్లు చెప్పడం గమ్మత్తుగా ఉంది.
ఉపసంహరించుకున్నట్లు చెప్పకా..మళ్లీ ఉద్యోగాలు
మరోవైపు 2006లో జీవో 36ను విత్ డ్ష్రా చేసుకున్నట్లు రఘుమారెడ్డి చెప్పినప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సదరు జీవో ఆధారంగా టీఎస్ఎస్పీడీఎల్ లో ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. దీనికి రఘుమారెడ్డి ఉద్యోగుల నుంచి అందినకాడికి దండుకొని మెదక్ సర్కిల్ లో అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వడం విస్మయం కల్గిస్తోంది. అంతేకాక మిగతా సర్కిళ్ల పరిధిలోనూ అనేక మందికి జీవో 36 ప్రకారమే ఉద్యోగాలు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనైతే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన అనేక మంది ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరందరకీ కేవలం సిఫార్స్ ల ఆధారంగానే ఉద్యోగాలు రాగా.. అన్ని అర్హతలు కల్గిన అభ్యర్థులకు మాత్రం జాబ్స్ రాకపోవడం శోచనీయం.
అయితే టీఎస్ఎస్పీడీఎల్ లో జరిగిన అక్రమ నియామాకాల సంగతి తేల్చాలని కొందరు అసలైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ మొత్తం తంతుపై ఎసీబీ, విజిలెన్స్ ద్వారా విచారణ చేయించాలని పిటిషనర్లు కోర్టులో రిట్ పిటిషన్ ద్వారా కోరడం జరిగింది. అంతేకాక కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్ఎస్పీడీసీఎల్ కు సీఎండీగా రఘుమారెడ్డి స్థానంలో మరో అధికారి రావడం తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. జరిగిన మొత్తం వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రఘుమారెడ్డి హయాంలో చేపట్టిన నియామకాలు, లీగల్ అటాచ్ మీదకు విచారణ చేయించాలని అభ్యర్థించారు. దీంతో వెంటనే స్పందించిన కొత్త సీఎండీ ఈ మొత్తం యవ్వారానికి సంబంధించిన సమగ్ర నివేదికను తనకు వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించ్షారు. వెరసి పాత సీఎండీ రఘుమారెడ్డి, అక్రమంగా టీఎస్ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగాలు పొందిన వారిలో ప్రస్తుతం వణుకు మొదలైంది. ఈ వ్యవహారం ఎప్పుడు తమ మెడకు ఉరిలా బిగుసుకుంటుందోనని తీవ్ర టెన్షన్ కు గురవుతున్నట్లు సమాచారం.
అప్పటి రఘుమారెడ్డి చేసిన అవినీతి భాగోతం పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..