ఐసీసీ ఫైనల్స్లో తమకు తిరుగులేదని మరోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్లోని ఓవల్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆ జట్టు సంచలన ఆటతో భారత్ను చిత్తుగా ఓడించింది. 209 పరుగలు తేడాతో గెలిచి టెస్టు గదను సాధించింది. బౌలర్లు చెలరేగడంతో ఐదో రోజు తొలి సెషన్లోనే టీమిండియాను ఆలౌట్ చేసింది. నాథన్ లియాన్ ఓవర్లో సిరాజ్ స్వీప్ షాట్ ఆడి బోలాండ్ చేతికి చిక్కాడు. దాంతో, ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో అజింక్యా రహానే(46), విరాట్ కోహ్లీ(49) ప్రతిఘటించినా బోలాండ్, లియాన్ వెంట వెంటనే వికెట్లు తీసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, మరోసారి టైటిల్ వేటలో చతికిల పడిన టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.