వాళ్లను కించపరచడం నా ఉద్దేశం కాదు : అఫ్రిది

ఇస్లామాబాద్ : వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిదీ అఫ్రిది ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల తన బయోగ్రఫీ ‘గేమ్ ఛేంజర్’లో గంభీర్తో పాటు పలువురు క్రికెటర్లను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించాడు. దాంతో ఆగకుండా ఆల్టైం ప్రపంచకప్ జట్టును కూడా ప్రకటించి మరో దుమారానికి తెరలేపాడు. ఆ జట్టులో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్తో పాటు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా చోటు కల్పించలేదు. దీంతో భారత్తో పాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, తాజాగా వాళ్లిద్దరికీ చోటు కల్పించకపోవడానికి గల కారణాలు అఫ్రిది వెల్లడించాడు. ‘సచిన్, ధోనీ భారత క్రికెట్కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టారు. వాళ్లను కించపరచడం నా ఉద్దేశం కాదు. కోహ్లీని ఎంచుకోవడానికి కారణం అతని బ్యాటింగ్ మాయాజాలమే. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. రెండు దేశాల మధ్య విద్వేషాలను తగ్గించేందుకు క్రికెట్ మంచి మార్గం. అందుకే భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడాలి. అలా అయితేనే రెండు దేశాల ప్రజల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి’ అని అఫ్రిది పేర్కొన్నాడు. 2004లో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ చూసేందుకు భారత్ నుంచి పాకిస్థాన్కు వచ్చిన అభిమానులను పాక్ ప్రజలు ఎంతో ప్రేమతో చూసుకున్నారని గుర్తు చేశాడు. భారత్తో మళ్లీమళ్లీ మ్యాచ్లు ఆడాలని కోరుకుంటున్నానన్నాడు. రెండు దేశాల ప్రజలు తమ క్రికెటర్లను ఎంతగానో ప్రేమిస్తారు. ఈ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ చూడాలని కోరుకుంటారని అఫ్రిది పేర్కొన్నాడు.