- కంచికచర్ల స్పందన కార్యక్రమంలో కలెక్టర్
విజయవాడ : జగనన్నకు చెబుదాం ద్వారా స్వీకరించిన అర్జీలను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు తెలిపారు. జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక మండలంలో జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలు నిర్వహిస్తున్నామన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు ఆర్జీలను ఆయా శాఖలకు పంపడమే కాక వాటి పరిష్కారానికి వారు తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో తనతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు హాజరవుతున్నారన్నారు. ప్రజల నుండి వస్తున్న అర్జీలను అప్పటికప్పుడే ఆయా శాఖల అధికారులను వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారనే పూర్తి సమాచారం అర్జీదారులకు తెలిపే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. వ్యవసాయ భూములు, నివేశిన స్థలాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లబ్ది చేకూరకపోవడం రేషన్కార్డులు, ఫిన్షన్లు వంటి విషయాలపై ఫిర్యాదులు వస్తే వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం వలన ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతున్నాయన్నారు. నందిగామ నియోజకవర్గం కు సంబంధించి కంచికచర్ల మండలంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల వారీగా అర్జీదారులను పిలిచి అర్జీలను స్వీకరించి సంబంధిత అదికారుల సమక్షంతో వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తక్షణమే పరిష్కరించలేని మరి కొన్ని సమస్యలను అధికారులు ఎప్పటిలోగా పరిష్కరించగలరు అనే విషయాన్ని అర్జీదారులకు సంబంధిత అధికారులతో తెలియజేసి నిద్దేశించిన సమయానికి పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. జగనన్నకు చెబుదాంలో స్వీకరించిన ప్రతి అర్జీని నమోదు చేస్తున్నామని, పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన సమాచారంతో పాటు రాష్ట్ర స్థాయిలో పరిష్కరించవలసిన ఆర్జీలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. స్థానిక అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అనేక సమస్యలు జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కరం అవుతున్నయన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఆర్డివో కె. రవీంద్రరావు, డ్వామా పిడి జె. సునీత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీకుమార్, జడ్పి సిఇవో వి. జ్యోతిబసు, డిపివో జయచంద్ర గాంధీ, సోషల్ వెల్ఫెర్ అధికారిని బి. విజయభారతి, ఐసిడిఎస్ జి. ఉమాదేవి, జిల్లా హౌసింగ్ అధికారి రజిని కుమారి, డిసిహెచ్ఎస్ బి.సి.కె నాయక్, డిప్యూటి డియంహెచ్వో జె.ఇందుమతి, యంపిడివో కె. శిల్ప, యంఆర్వో శంకర్బాబు, జడ్పిసిటి వెల్పుల ప్రశాంతి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.