ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ బయట మీడియాతో మాట్లాడారు. యువతీ యువకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ విలువైన ఓటును వేయాలని పిలుపునిచ్చారు. ‘పోలింగ్ శాతం కొద్దిగా తక్కువగా ఉందని నేను విన్నాను. ఓటరు ఐడీ ఉన్న యువతీ యువకులందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ నగరం ఎంత కొత్తగా మారింది. లేని నీళ్ళు వచ్చాయ్. కరెంట్ వచ్చింది. అభివృద్ధి కొనసాగాలి.. ప్రశాంతమైన జీవితం గడపాలంటే తప్పకుండా ఓటేయాలి. ఓటేయడానికే ఇవాళ హాలిడే ఇచ్చారు. అందుకని అంతా వచ్చి ఓటేయండి. మీకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేయండి. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశాను. మీరూ రండి.. ఓటేయండి’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.