నిర్లక్ష్యం ఖరీదు.. నాలుగు ప్రాణాలు..

- పెళ్లి జరుగుతుండగా ప్రమాదం
- ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి
- మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అంబర్ పేట పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెరల్ గార్డెన్ లో పెళ్లి జరుగుతోంది. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గోడ కూలి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు ఆటోలు శిథిలాల కింద ధ్వంసమయ్యాయి. 10 టూ వీలర్ లు నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడిన వారిని మలక్ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్ట్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ తోపాటు మరికొంతమంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
గోడ కూలడానికి కారణమిదే
ఈ ప్రమాదంపై ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ స్పందించారు. ఫంక్షన్ హాల్ పురాతమైన భవనం అన్నారు. 15 ఏళ్ల క్రితం ఫంక్షన్ హాల్ నిర్మించారని తెలిపారు. నిర్వాహాకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఫంక్షన్ హాల్ నిర్వాహాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.