దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ఉదయం సెన్సెక్స్ 63,140.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,725 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. దాంతో మార్కెట్లు పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. అయితే, ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన విధాన వైఖరిని అవలంబిస్తామని ఆర్బీఐ ప్రకటించడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడ్డట్లయ్యింది. టేడ్రింగ్ ముగిసే వరకు సెన్సెక్స్ 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 పాయింట్లు, నిఫ్టీ 91.85 పాయింట్లు పతనమై 18,634.55 వద్ద పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ్టి ట్రేడింగ్లో దాదాపు 1457 షేర్లు పురోగమించగా.. 1994 షేర్లు క్షీణించాయి. 106 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఎన్టీపీసీ, జెఎస్డబ్ల్యూ స్టీల్, ఒఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, లార్సెన్ అండ్ టూబ్రో లాభపడ్డాయి. సెన్సెక్స్లో ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడగా.. సన్ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పతనమయ్యాయి.