భారత్లో తొలిసారి వాలీబాల్ క్లబ్ ప్రపంచ చాంపియన్ షిప్.. !

- భారత్కు రానున్న అత్యుత్తమ అంతర్జాతీయ వాలీబాల్..
న్యూ ఢిల్లీ, 31 జనవరి ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భారత్లో తొలిసారి వాలీబాల్ క్లబ్ చాంపియన్షిప్ అభిమానుల ముందుకు రాబోతున్నది. వాలీబాల్ వరల్డ్, ఎఫ్ఐవీబీ సంయుక్త ఆధ్వర్యంలో పురుషుల వాలీబాల్ క్లబ్ ప్రపంచ చాంపియన్షిప్నకు రంగం సిద్ధమైంది. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహిస్తున్న ఏ23 భాగస్వామ్యంతో రెండేండ్ల పాటు క్లబ్ వరల్డ్ చాంపియన్షిప్ అలరించనుంది. ఈ ఏడాదితో పాటు 2024 ప్రైమ్ వాలీబాల్ లీగ్లో చాంపియన్గా నిలిచే జట్లు భారత్ తరఫున క్లబ్ వరల్డ్కప్లో పోటీకి దిగుతాయి. ప్రపంచంలో వాలీబాల్ పవర్హౌజ్లుగా వెలుగొందుతున్న ఇటలీ, బ్రెజిల్, ఇరాన్ లాంటి దేశాల ప్లేయర్లతో కలిసి భారత ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. దేశంలో ప్రముఖ స్పోర్ట్స్మార్కెటింగ్ ఫర్మ్గా వెలుగొందుతున్నబేస్లైన్ వెంచర్స్..భారత్లో క్లబ్ వరల్డ్ చాంపియన్షిప్ను ఎక్స్క్లూజివ్గా మార్కెటింగ్ చేస్తున్నది. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్కు కూడా బేస్లైన్ వెంచర్స్ భాగస్వామిగా కొనసాగుతున్నది. ఈ ఏడాది డిసెంబర్ ఆర నుంచి పది వరకు భారత్లో క్లబ్ వరల్డ్ చాంపియన్ జరుగనుంది. అయితే ఆతిథ్యమిచ్చే నగరం ఈ ఏడాది ఆఖర్లో నిర్ణయించే అవకాశముంది. దేశంలో పీవీఎల్ ద్వారా వాలీబాల్కు మెండైన ఆదరణ లభిస్తున్నది. 2022లో మొదలైన వాలీబాల్ లీగ్ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. తొలి సీజన్లోనే చాలా మందికి చేరువైంది. దేశవ్యాప్తంగా టెలివిజన్ వ్యూవర్షిప్ రికార్డు స్థాయిలో 133 మిలియన్ల మందికి చేరువైంది. మరోవైపు డిజిటల్ ఫ్లాట్ఫ్లామ్ ద్వారా 84మిలియన్ల మంది వీక్షించారు. గత ఇరవై ఏండ్లుగా వాలీబాల్ క్లబ్ ప్రపంచ చాంపియన్షిప్ ద్వారా చాలా మంది ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ క్లబ్ల ద్వారా దాదాపు 350,000 యూఎస్ డాలర్ల ప్రైజ్మనీ లభించింది.
ఎఫ్ఐవీబీ అధ్యక్షుడు డాక్టర్ ఆరీ గ్రాసా స్పందన: ‘ఎఫ్ఐవీబీ ద్వారా దేశంలో అత్యుత్తమ వాలీబాల్ పోటీలను తొలిసారి అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాం. క్లబ్ వరల్డ్ చాంపియన్షిప్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ క్లబ్లు పాలుపంచుకోనున్నాయి. ఆతిథ్య హోదాలో భారత్తో పాటు వివిధ దేశాల నుంచి ప్లేయర్లు లీగ్లో పోటీపడబోతున్నారు. దీని ద్వారా అభిమానులకు ఫుల్ జోష్ దక్కనుంది. ఉపఖండ వాసులకు క్లబ్ ప్రపంచ చాంపియన్షిప్ ద్వారా సరికొత్త అనుభూతి లభించనుంది. లీగ్ను ఇక్కడికి తీసుకురావడం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాం. వాలీబాల్ వరల్డ్ టీవీ ద్వారా క్లబ్ ప్రపంచ చాంపియన్ మ్యాచ్లతో ఫ్యాన్స్కు అత్యుత్తమ ప్రదర్శన అందిస్తామన్న నమ్మకం ఉంది. బేస్లైన్ వెంచర్స్ ఎండీ అండ్ కోఫౌండర్ తుహిన్ మిశ్రా స్పందిస్తూ ‘భారత క్రీడారంగంలో ఇది చారిత్రక సందర్భం. గ్లోబల్ ఈవెంట్ ద్వారా తొలిసారి వాలీబాల్ పోటీలను అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ ప్లేయర్లు భారత్కు రానున్నారు. స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడే అవకాశం భారత ప్లేయర్లకు దక్కనుంది. ఇది మన ప్లేయర్లకు బాగా లాభించనుంది. 2028 ఒలింపిక్స్కు భారత వాలీబాల్ జట్టు అర్హత సాధించేందుకు క్లబ్ లీగ్ దోహదపడనుంది. గ్లోబల్ ఈవెంట్ భారత ప్లేయర్లకు మంచి వేదిక కానుంది.
కొచ్చి బ్లూ స్పైకర్స్ యజమాని థామస్ మూత్తుట్: ‘ఇది గొప్ప వార్త. రూపే ప్రైమ్ వాలీబాల్లో ప్రతీ జట్టుకు ఇది లాభించే అంశం కానుంది. క్లబ్ ప్రపంచ చాంపియన్షిప్లో అత్యు్త్తమ ప్రదర్శన కనబరిచేందుకు మంచి అవకాశం. ఈ లీగ్ కచ్చితంగా భారత వాలీబాల్ అభిమానులకు మంచి వినోదం అందించడం ఖాయం. భారత గడ్డపై ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కనువిందు చేయడం ఖాయం’ అని అన్నారు.
ఏ23 సమర్పణలో రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ భారత ఉపఖండం అవతల వాలీబాల్ వరల్డ్ టీవీలో ప్రసారం కానుంది. క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్ టోర్నీకి అర్హత సాధించిన జట్లు, తుది షెడ్యూల్ను ఈ ఏడాది ఆఖర్లో వెలువరించనున్నారు. వాలీబాల్ వరల్డ్ టీవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వీక్షించేందుకు మంచి అవకాశం.