- ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు
- చైన్ లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు
యాదాద్రి భువనగిరి : ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లిబొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే మంటలు క్రమంగా మిగతా బోగీలకు విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి
బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో ఆరు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. అయితే ప్రస్తుతం ఆ చైన్ లాగిన వ్యక్తి పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. ఆ తరువాత అతను పడిన ఆందోళనకో ఏమో కానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వెంటనే రైల్వే సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని సమాచారం.