- కేంద్రానికి అల్టిమేటం జారీచేసిన రెజ్లర్లు..
- మేము మానసికంగా అనుభవిస్తున్న బాధలను అర్థం చేసుకోండి..
- రాజీ చేసుకోవాలని మాపై చాలా ఒత్తిడి తెస్తున్నారు..
- బ్రిజ్ భూషణ్ మనుషులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు : సాక్షి మాలిక్
సోనీపట్ : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్భూషణ్ను ఈనెల 15 లోగా అరెస్ట్ చేయాలని రెజర్లు డిమాండ్ చేస్తున్నారు. 15వ తేదీ వరకు వేచి చూస్తామని, బ్రిజ్భూషణ్ను అరెస్ట్ చేయకపోతే ఏషియన్ గేమ్స్ ఆడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆసియా గేమ్స్ ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హర్యానాలోని సోనిపట్ లో మహాపంచాయత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. ‘‘సమస్యలను పరిష్కరిస్తేనే మేం ఆసియా గేమ్స్ లో పాల్గొంటాం. ప్రతి రోజూ మానసికంగా మేం అనుభవిస్తున్న బాధలను మీరు అర్థం చేసుకోలేరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమలో ఐక్యత లోపించిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. బజరంగ్, వినేశ్ ఫొగట్, తాను.. కలిసే ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘బ్రిజ్ భూషణ్ పై చేసిన ఆరోపణల విషయంలో ఒత్తిడి వల్లే బాలిక (మైనర్ రెజ్లర్) తన మాట మార్చింది. రాజీ చేసుకోవాలంటూ మా మీద చాలా ఒత్తిడి ఉంది. బ్రిజ్ భూషణ్ మనుషులు మాకు ఫోన్లు చేసి, బెదిరింపులకు దిగుతున్నారు’’ అని వాపోయింది. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకుండా.. నిష్పాక్షిక దర్యాప్తు అనేది సాధ్యం కాదని చెప్పింది.