- కేసీఆర్ హయాంలో సృష్టించిన అభివృద్ధిపై డాక్యుమెంట్
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి ముందే.. బీఆర్ఎస్ ఈ డాక్యుమెంట్ను విడుదల చేసింది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పు ల కుప్పగా మారిందని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇందులో దాదాపు 20 మంది ఉన్నట్టు సమాచారం. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత, రిటైర్డ్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొన్ని రోజులుగా తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయా లు, నిధుల సమీకరణ, కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీల లెక్కలను ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీంతోపాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి. ఏ ఏడాది.. ఏ పథకం కింద.. ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి? ఎంత వినియోగించారు? ఏవైనా నిధులను మళ్లించారా? వంటి వివరాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చనే కోణంలో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం.. ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఈ శ్వేతపత్రాన్ని ప్రభు త్వం బుధవారం అసెంబ్లీలో విడుదల చేయనున్నది. శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టి, వివరాలను తెలియజేస్తారా? లేదా సీఎం రేవంత్రెడ్డి సభ ముందు ఉంచుతారా? అనే చర్చ జరుగుతున్నది.