- బిల్లులు రాక నిలిచిపోయిన పనులు…
- ఇబ్బందుల్లో కాంట్రాక్టర్లు..!
మిర్యాలగూడ : కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో ఉండాలనే లక్ష్యంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మన బడి ద్వారా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు పలు ప్రభుత్వ పాఠశాలను మొదటి విడతగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎంతో ఆర్భాటంగా మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల తరగతుల గదుల నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ సకాలంలో బిల్లులు రాకపోవడంతో పాటు నిధులు మంజూరు కాక అసంపూర్తిగా తరగతి గదులు పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు నిరాకరించి చేతులెత్తేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మన ఊరు మనబడి ద్వారా మొదటి విడతగా 71 పాఠశాలలు ఎంపిక చేసి రూ. 28 కోట్లు నిధులు మంజూరు చేశారు. మిర్యాలగూడ పట్టణంలో షాబు నగర్ పాఠశాల 1 పూర్తి కాగా, మిగిలిన యుపిఎస్ గాంధీ పార్క్, బాలికల ఉన్నత పాఠశాల, బకాల్ వాడి ఉన్నత పాఠశాల, ఎన్ఎస్పి క్యాంపు పాఠశాల, పిఎస్ ఉర్దూ మీడియం పాఠశాల, నంది పహాడ్, యాద్గార్ పల్లి, జెడ్ వి గూడ, సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నిధులు మంజూరు అయ్యేదాకా పనులు చేపట్టమని కోవడంతో మన ఊరు మనబడి పాఠశాల తరగతుల గదుల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పాఠశాలలో నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆయా పాఠశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ పార్క్ ప్రాథమికున్నత పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించినట్లయితే మూడు స్లాబుల పనులు పూర్తి అయి తరగతుల గదులకు కొంత భాగం గోడలను నిర్మించారు. వంటశాల, టాయిలెట్స్ గదులు నిర్మించగా ఆఫీస్ కార్యాలయం తో బాటు తరగతి గదులు పూర్తిస్థాయిలో ప్లాస్టింగ్ వర్క్స్, సానిటేషన్ ఫ్లోరింగ్ పనులు చేయవలసి ఉన్నది. కాంట్రాక్టర్కు సుమారు 30 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా నిర్మాణ పనులను ఆరు నేలలనుంచి నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మన ఊరు మనబడి నిధులు మంజూరు అవుతాయని త్వరితగతిన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ముందుకు వస్తామని కాంట్రాక్టర్లు కొండంత ఆశతో ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నియామకం కాకపోవడంతో నిధులు మంజూరుకు, పనులు చేపట్టేందుకు మరింత ఆలస్యం అవుతుందని అప్పటివరకు వేచి చూడాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు.