- ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించాలని నోటీసులు
- సాయంత్రం 5 గంటలలోపు సీల్డ్ కవర్లో ఇవ్వాలని సూచన
- దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ నోటీసులు
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ దేశంలోని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీలు.. వాటికి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా పార్టీలకు అందిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీల్డ్ కవర్లో అందించాలని ఈసీ డెడ్ లైన్ విధించింది. ఈ గడువు ముగియబోతున్న తరుణంలో ఈసీ ఆదేశాలను రాజకీయ పార్టీలు అమలు చేస్తాయా లేదా అన్నది నేడు తేలిపోనుంది. ఈ నెల 2న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలకు ఈ మేరకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం మొదలైనప్పటి నుంచి తమకు ఈ విధానంలో అందిన విరాళాల వివరాలను పేర్కొంటూ సీల్డ్ కవర్ లో నివేదిక పంపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈసీ దాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్దితి నెలకొంది. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతి జరుగుతోందని, కాబట్టి వీటి చెల్లుబాటుకు ఉన్న రాజ్యాంగబద్ధతను తేల్చాలంటూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.