- కేసీఆర్కు రెండుచోట్లా ఓటమి ఖాయం
- అవినీతి బీఆర్ఎస్ను అంతమొందించండి
- తెలంగాణలో కాంగ్రెస్ హామీలను అమలు చేస్తాం
- కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వచ్చి చూడండి
- అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజ్యం ఏలుతున్నారు
- మోడీ ఎన్నిసార్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ ఖేల్ ఖతం
- కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటన
- అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన
- ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
- నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు
- గౌడన్నలకు వైన్షాపుల్లో 25శాతం కేటాయింపు
- ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు
- జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం
- బీసీ డిక్లరేషన్ ప్రకటనలో సిద్దరామయ్య, రేవంత్, షబ్బీర్, కోదండరామ్
కామారెడ్డి : తెలంగాణలో కాంగ్రెస్దే అధికారం.. కేసీఆర్కు రెండుచోట్లా ఓటమి ఖాయం.. అవినీతి బీఆర్ఎస్ను అంతమొందించండి.. తెలంగాణలో కాంగ్రెస్ హామీలను అమలు చేస్తాం కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వచ్చి చూడండి..అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజ్యం ఏలుతున్నారు. మోడీ ఎన్నిసార్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ ఖేల్ ఖతం.. అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలకమైన వ్యూహాలను అమలు చేస్తోంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నేడు నామినేషన్ వేయగా, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తమ ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేస్తామని సిద్ధరామయ్య హావిూ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలని కేసీఆర్కు చెప్పారు. కేసీఆర్ కర్ణాటకకు వస్తే దగ్గరుండి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీంలను పక్కాగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి తేడా ఏవిూ లేదని, బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అని ఆరోపించారు. తెలంగాణకు మోదీ 100 సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 సభలు పెట్టారని, రోడ్ షోల్లో విపరీతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రధాని మోదీ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదని అన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీసీల వెనుకబాటు తనానికి ప్రధాని మోదీనే కారణమని అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని సిద్ధరామయ్య విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కామారెడ్డిలో రేవంత్ రెడ్డి చిత్తుగా ఓడిస్తారని సిద్దరామయ్య అన్నారు. కామారెడ్డితో పాటు, గజ్వేల్ లో కూడా సీఎం కేసీఆర్ ఓడిపోతారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని అన్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డితో పోటు కొడంగల్ కూడా రెండు చోట్ల గెలుస్తారని అన్నారు. బీసీల 34 రిజర్వేషన్లు 25 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి డబ్బును ఖర్చు చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపు ఇచ్చారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనైపోయిందని సిద్ధరామయ్య అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి నాలుగైదు సీట్లు వస్తే అవే చాలా ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ వంద సార్లు వచ్చి ప్రచారం చేసినా బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. మోడీ ఎక్కడ ప్రచారం చేశారో అక్కడే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. మోడీని నమ్ముకున్న కర్నాటక బిజెపి నేతలు ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారని తెలిపారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు.. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్ సభ నిర్వహించింది. బిసి డిక్లరేషన్ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్, సిపిఐ నేత నారాయణ, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కుల గణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చింది. బీసీడీలో ఉన్న ముదిరాజులను బీసీ
ఏ లోకి మారుస్తామని, నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని హావిూ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీతో, టీజేఎస్ చీఫ్ కోదండరామ్, కమ్యూనిస్టు ముఖ్య నేతలతో పాటు పలువురు నాయకులు హాజరైన ఈ సభలో బీసీలకు కీలక హావిూలు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42 శాతం పెంచుతామని, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టడంతో పాటు వైన్ షాపులో గౌడ్లకు ప్రస్తుతం ఇస్తున్న 15 రిజర్వేషన్ 25 శాతానికి పెంచుతామని పేర్కొంది. జనగామ జిల్లాను సర్వాయి పాపన్న సర్దార్ పాపన్న పేరు పెడుతామని, ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్ల ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో మూడు చోట్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తమని హావిూ ఇచ్చింది. ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. ప్రతి జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టనున్నట్టుగా కాంగ్రెస్ హావిూ ఇచ్చింది. ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్లను ఖర్చు చేయనున్నట్టుగా కాంగ్రెస్ వివరించింది. బీసీ కార్పోరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రుణ సౌకర్యం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేనేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ హావిూ ఇచ్చింది. జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మారుస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో మూడు చోట్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ తెలిపింది.
బీసీ డిక్లరేషన్లోని అంశాలు:
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంపు.
బీసీలకు రాజకీయంగా మరిన్నీ అవకాశాలు.
ప్రతి మండలంలో బీసీలకు ప్రత్యేక గురుకులాలు.
ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు.
50ఏళ్లు దాటిన పద్మశాలీలకు పించన్ సౌకర్యం.
మహాత్మ జ్యోతి బాపులే సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్లు.
జిల్లా కేంద్రాల్లో బీసీలకు ప్రత్యేక భవనాలను నిర్మాణం.
విశ్వకర్మలు, మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
గద్వాల్, సిరిసిల్ల, నారాయణ్ ఖేడ్ లో పవర్ లూమ్స్ ఏర్పాటు
రజకుల కోసం రూ.10 లక్షల సబ్సిడీ..
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు.
వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రూ.10 లక్షల రుణం సాయం.
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ పెంపు
వైన్స్ టెండర్లలో గౌడ్స్ రిజర్వేషన్ మరింత పెంపు