- మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.
- మేకగూడ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ఎన్నికల విస్తృత ప్రచారం.
- ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న నేతలు.
- బీఆర్ఎస్ నాయకులకు కండువకప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే.
నందిగామ : బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అసాధ్యమైన హామీలిచ్చి, ఇప్పుడు అన్నింటిని గాలికొదిలేసి నిరుద్యోగుల సంఖ్యను పెంచి, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులను పెంచి యువతను,నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు.నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కి మద్దతుగా సర్పంచ్ పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు.మేకగూడా గ్రామపంచాయతీతో పాటు పరిధిలోని కోల్ భాయ్ తండా,ధర్మయ్య తండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో అడుగడుగున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం,నిరుద్యోగ భృతి కల్పిస్తామని మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను పక్కదారి పట్టించాడానికి గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులను పెంచి వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు కానీ ఉరికో ఉద్యోగం కూడా రాలేదని,ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్,కొత్త సంక్షేమ పథకాలు గుర్తువస్తాయి తప్ప అమలు మాత్రం కావని,ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని వారి మాటలకు మళ్ళీ మోసపోవద్దని తెలిపారు. షాద్ నగర్ లో కక్ష్యపురితమైన రాజకీయం నడుస్తుందని, సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులను అద్దం పెట్టుకుని కేసులు నమోదు చేయిస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటగా ప్రవేశపెట్టే ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు,యువకులకు కాంగ్రెస్ కండువకప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆహ్వానించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ రెడ్డి,కొమ్ము కృష్ణ,జిల్లెళ్ల రాంరెడ్డి,దంగు శ్రీను,చంద్రపాల్ రెడ్డి,రూప్ సింగ్,జ్ఞానేశ్వర్,సుఖ్య నాయక్,బంట్రపు జంగయ్య,విజ్ఞేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.