కీవ్ : రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, ఎయిర్ఫోర్స్ ఆస్తులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు, తన వ్యక్తిగత వివరాలు తెలిపేందుకు నిరాకరించిన ఓ అమెరికా అధికారి.. ఉక్రెయిన్ గత కొన్ని నెలలుగా అడుగుతున్న దీర్ఘశ్రేణి క్షిపణులను ఆ దేశానికి చడీచప్పుడు లేకుండా అందజేశామని చెప్పారు. ప్రస్తుతం అవి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ఉన్నాయని తెలిపారు. కాగా తూర్పు, దక్షిణ ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలపై రాత్రిపూట జరిపిన దాడుల్లో రెండు స్థావరాల్లో తొమ్మిది హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు ప్రకటించాయి. సైనిక పరికరాలు, గగనతల రక్షణ వ్యవస్థ, ఆయుధాగారం, రన్వేలను సైతం ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. ఆపరేషన్ డ్రాగన్ ఫ్లై పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో డజన్ల కొద్దీ రష్యా సైనికులు గాయపడినట్లు ఉక్రెయిన్ సేనలు వెల్లడించాయి.పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ అమెరికా అధికారి మాట్లాడుతూ.. ఉక్రెయిన్కు ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ సరఫరా చేశామని చెప్పారు. గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయమై హామీ ఇచ్చారన్నారు. ఈ క్షిపణుల్లోని కొన్ని రకాలు 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలవని తెలిపారు.