- మరోసారి మనసులు గెలిచిన డేవిడ్ భాయ్
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ.. తోటి వాళ్లను అలరించే వార్నర్.. వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోరులో గ్రౌండ్స్మన్ అవతారం ఎత్తాడు. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లంక తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ సమయంలో తక్షణమే స్పందించిన మైదాన సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పే ప్రయత్నం ప్రారంభించారు. ఆ సమయంలో మైదానం వీడుతున్న వార్నర్ గ్రౌండ్ సిబ్బందితో కలిసి కవర్స్ లాగేందుకు సహకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఆట పట్ల అతడికున్న నిబద్దతకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వరల్డ్ కప్లో రెండు మ్యాచ్లు ఓడి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆసీస్.. లంకతో పోరులో అదరగొట్టింది. ముఖ్యంగా గత మ్యాచ్లో పేలవ ఫీల్డింగ్తో నిరాశ పరిచిన కంగారూలు ఈ సారి మెరుగైన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అసాధ్యం అనుకున్న క్యాచ్ను వార్నర్ ఒడిసి పట్టిన తీరు అభిమానులను కట్టి పడేసింది. కెప్టెన్ కమిన్స్ కూడా అటు బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు.. ఓ కీలక రనౌట్ చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పాథుమ్ నిషాంక (61బీ 8 ఫోర్లు), కుషాల్ పెరెరా (78బీ 12 ఫోర్లు) దంచికొట్టడంతో ఒక దశలో 125/0తో అత్యంత పటిష్ట స్థితిలో కనిపించిన లంక.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి.. ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.