- సుమారు 3లక్షల విలువైన సామాను దోపిడీ
- చాకచక్యంగా కేసును చేధించి పట్టుకున్న పోలీసులు…
మిర్యాలగూడ : ఇంటికి తాళం వేసిన కుటుంబం అమెరికా పర్యటనకు వెళ్ళింది… ఇదే అదునుగా భావించిన దొంగలు… ఇంటి తాళాలు పగలగొట్టి… దర్జాగా ఓ గూడ్స్ వాహనం పెట్టి ఇంటిలోని సుమారు 3లక్షల విలువైన సామాను దోచుకు పోయారు… ఫిర్యాదు అందుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు మొదలుపెట్టి ఆరా తీస్తుండగా… దోచుకున్న సొత్తును విక్రయించేందుకు వెళ్తూన్న దొంగలు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన ఆదివారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ డి.ఎస్.పి కె వెంకటగిరి ఆదివారం నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి,వెల్లడిరచిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండల పరిధిలోని అవంతిపురం లో ఉంటున్న అమర వెంకటరావు ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్లో అకౌంటెంట్ గా పనిచేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఆయన కుటుంబంతో సహా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలునర్సింగ్ గంగాధర్,కుంచం ప్రశాంత్, పట్టేటి హేమంత్ కుమార్, ఈర్ల మల్లేష్, పాతకోటి బుచ్చిబాబు లు ఈనెల 10వ తారీఖు రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి తమ వెంట తెచ్చుకున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ లో వెంకట్రావు ఇంటిలోని 2 ప్రీజ్ లు, టీవీ, కంప్యూటర్, వాషింగ్ మిషన్, ఎలక్ట్రికల్ ఓవెన్, గీజర్,పట్టు చీరలు,సెల్ ఫోన్, వెండి దీపపు కుందులు సహా మొత్తం సామాను దర్జాగా తరలించారు. తీసుకుపోయిన సామాన్లు నేరేడుచర్లలో ఓ ఇంటిలో భద్రపరిచారు. వెంకట్రావు బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూరల్ ఎస్ఐ నరసింహులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు, వాహనంలో తరలించుకు పోయిన గుర్తులు ఆధారంగా కేసును చేదిస్తున్న సమయంలోనే దోచుకున్న సామాను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు నిందితులు తిరిగి అదే వాహనంలో నేరేడుచర్ల నుండి మిర్యాలగూడ వైపు వస్తుండగా ఆలగడప వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్ పోలీసులు వాహనాన్ని, నిందితులను పట్టుకొని స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని వీరిపై గతం లో కేసులు ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ ఎస్సై నరసింహులు, సిఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ బి శ్రీనివాసులను జిల్లా ఎస్పీ అపూర్వరావ్ అభినందించినట్లు ఆయన తెలిపారు. డిఎస్పీ వెంకటగిరి అభినందించి, ప్రోత్సాహకంగా నగదు అందజేశారు.