- హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి..
- మేనిఫెస్ట్ ప్రకటించిన కేసీఆర్..
- ఇవ్వని హామీలను కూడా నెరవేర్చాం..
- ఎంతో అధ్యయనం చేసి రూపిందించిన మయానిఫెస్టో ఇది..
- ఎన్నికలకు ఇంకా 45 రోజుల ముందే ప్రకటన..
- అంతకు ముందు తెలంగాణ భవన్లో అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందజేత..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అడుగు వేస్తుంది భారతీయ రాష్ట్ర సమితి. మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా అ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు తెలంగాణ ప్రజల సంక్షేమంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న కేసీఆర్.. గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు సీఎం కేసీఆర్. ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీల ఎన్నికల హామీలు, వాటి అమలు తీరుతెన్నులను అధ్యయనం చేసి.. అన్నివర్గాలను ఆకర్షించేలా హామీలు రూపొందించినట్లు తెలిపారు. 2014లో మేనిఫెస్టోను ముందుగానే విడుదల చేసిన గులాబీ పార్టీ.. 2018లో మాత్రం ఎన్నికలకు మూడురోజుల ముందే విడుదల చేసింది. ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల ముందే మేనిఫెస్టోను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటివరకు ఇస్తున్న ఆసర పెన్షన్ రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అంతేకాదు ప్రతి ఏడాది రూ.500 పెంచుతూ.. ఐదేళ్ల వరకు రూ.5 వేలు చేస్తామన్నారు. దివ్యాంగుల్లో వెలుగులు నింపేందుకు మరింత చేయూతనివ్వాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించిందన్నారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంచుతామన్నారు. ఇక ప్రతి ఏటా రూ.300ల చొప్పున పెంచుతామన్నారు.
అలాగే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా అమలుచేస్తామన్నారు. ఇందుకు కోసం ‘కేసీఆర్ బీమా-ఇంటింటికీ ధీమా’ పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 93లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రూ.5లక్షల బీమా ను ఎల్ఐసీ సంస్థ ద్వారా చెల్లిస్తామని తెలిపారు. మహిళల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటిం చారు కేసీఆర్. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పథకం అమలు చేస్తామన్నారు. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నార బీఆర్ఎస్ అధినేత.
రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతామన్నారు. తొలి ఏడాది రూ.12వేల వరకు పెంచనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా పెంపు ఉంటుందని హామీ ఇచ్చారు. పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామన్నారు. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగు తాం. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు అర్హులైన పేద కుటుంబాలకు 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని మరో హామీ ఇచ్చారు. ఇక అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల తరహాలో కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామన్నారు కేసీఆర్.
తెలంగాణలో పటిష్ఠంగా అమలవుతున్న రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలోకి అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అగ్రవర్గ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పాత పెన్షన్ విధానం అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటిం చారు. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగుల పెన్షన్పై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
అసైన్డ్ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. అనాథ పిల్లల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతంగా కొనసాగుతుందన్నారు. గిరిజనుల కోసం ప్రకటించని హామీలను భారాస ప్రభుత్వం అమలు చేసింది. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం. భవిష్యత్లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు ప్రకటిస్తామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నాం. మేం ఇచ్చే హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో :
ఆరునెలల్లో అన్ని హామీలు అమలు.. 93 లక్షల కుటుంబాలకు ‘‘కెసిఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా’’. రూ.4,000 ఒక కుటుంబానికి ఖర్చు – రూ.5 లక్షల భీమా. తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం. ఆసరా పెన్షన్లు రూ.ఐదు వేలకు పెంపు. మొదటి సంవత్సరం రూ.3 వేలు. ప్రతి ఏటా రూ.500 పెంపు. వికలాంగ పెన్షన్ రూ. 6 వేలకు పెంపు. రైతు బందు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంపు. రూ.12 వేల నుంచి ప్రతి ఏటా రూ.వెయ్యి పెంపు. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం. ప్రతి నెల రూ.3 వేల పెన్షన్ పథకం.. రేషన్ కార్డు కలిగిన మహిళలకు రూ. 400 గ్యాస్ సిలిండర్. ఆరోగ్య శ్రీ కెసిఆర్ ఆరోగ్య రక్ష ద్వారా రూ.15 లక్షలు పెంపు. హైదరాబాద్ పరిధిలో మరో లక్ష ఇండ్ల నిర్మాణం. అగ్ర వర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్. ఇందు కోసం 119 హాస్టల్స్ ఏర్పాటు.46 లక్షల మంది మహిళా సంఘాలకు సొంత భవనాలు. అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ. అసైన్డ్ లాండ్ పై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి అమ్ముకునే హక్కు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ కోసం కమిటీ…
అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందజేత.. :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఆదివారం నాడు(అక్టోబర్ 15) తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. ఈ బీఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. బీఫామ్స్ నింపే విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంపై దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. అంతా తమకే తెలుసు అన్నట్లు ప్రవర్తించొద్దంటూ సున్నితంగా హెచ్చరించారు కూడా. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, హైరానా పడొద్దని నేతలకు సూచించారు కేసీఆర్. చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవ్వొద్దని సూచించారు. హడావుడిలో బీఫామ్స్ తప్పుగా నింపొద్దని, ఆ తరువాత టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని అలర్ట్ చేశారు.