- సీఎంఓ వాట్సాప్ చానెల్ను ఫాలో అయితే చాలు..
- ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ఏర్పాటు చేసిన సర్కార్..
హైదరాబాద్: ప్రభుత్వంతో ప్రజలకు ఎన్నో అవసరాలు ఉంటాయి. అయితే, సమాచార లోపం కారణంగా.. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏ జీవోలు జారీ చేస్తుంది? ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది? తమకు కావాల్సిన సమాచారం ఎలా తెలుసుకోవాలి? అనేది తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే, సమస్యలకు చక్కటి పరిష్కారం చూపింది తెలంగాణ సర్కార్. వాట్సాప్ తీసుకువచ్చిన నయా ఫీచర్ను ఉపయోగించి.. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే వాట్సాప్ నుంచి వచ్చిన నయా ఫీచర్ వాట్సాప్ ఛానల్లో తెలంగాణ సీఎంవో ఛానెల్ను కూడా ప్రారంభించింది. తద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారదిని ఏర్పాటు చేసింది సర్కార్.
అవును, తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ‘వాట్సాప్ చానెల్’ ను నేడు ప్రారంభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం తెలంగాణ సీఎంఓ నుంచి వెలువడే అధికారిక ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది. అయితే, ఈ సమాచారం మీరు కూడా పొందాలంటే.. తెలంగాణ సీఎంఓ వాట్సాప్ ఛానెల్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సీఎంఓ చానెల్ను వినియోగించుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ సంబంధిత వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
ముందుగా మీ మొబైల్లో గానీ, డెస్క్టాప్లో గానీ వాట్సాప్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి… తరువాత మొబైల్లో అయితే ‘అప్డేట్స్’ అనే ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. డెస్క్ టాప్ అయితే ‘చానల్స్’ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత “ప్లస్” బటన్ పైన క్లిక్ చేసి “ఫైండ్ ఛానల్స్” ను సెలక్ట్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ లో ‘తెలంగాణ సీఎంఓ’ అని టైప్ చేసి.. లిస్ట్ నుంచి చానెల్ను సెలక్ట్ చేసుకోవాలి. చానెల్ పేరు పక్కన ఒక గ్రీన్ టిక్ మార్క్ ను నిర్ధారించుకోవాలి. ఆ తరువాత ‘ఫాలో’ బటన్పై క్లిక్ చేయాలి. తద్వారా మీరు తెలంగాణ సీఎంఓ చానెల్లో చేరుతారు. దాంతో సీఎంఓ పంపే ప్రకటనలను నేరుగా వాట్సాప్లోనే చూడొచ్చు. అయితే, పైన ఇచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్లో చేరవచ్చు. ‘తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్’ ను ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం (సీఎం పీఆర్వో) సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తోంది.