తైపీ : తైవాన ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపడం గమనార్హం. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్య అని పేర్కొన్న తైవాన్.. ఆ వ్యవధిలో తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది. చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణించిన తైవాన్ రక్షణశాఖ.. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో ఇటువంటి మిలిటరీ విన్యాసాలతో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ తరహా ఘటనలకు బాధ్యత వహించడంతోపాటు సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలని సూచించింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని పేర్కొనడం గమనార్హం.