- ఆర్డీఎస్ వద్ద అడుగు పెడితే.. వదిలిపెట్టం
కొల్లాపూర్ : తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
1954లో ఆర్డీఎస్ కట్టారు.. దాన్ని కూడా నాటి పాలకులే నాశనం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో నేను అలంపూర్ వద్ద మొట్టమొదటి పాదయాత్ర చేశాను. ఆంధ్రాలో ఉన్న నాయకులు కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్టీఎస్ తూములు మూసివేస్తే మళ్లీ బాంబులు పెట్టి ఆర్డీఎస్ బద్దలు కొడుతామని చెప్పారు. సుంకేశుల బరాజ్ వద్ద ఉన్న నాకు రక్తం మరిగింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించాను. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు.. అక్కడ అడుగు పెడితే.. సుంకేశుల బరాజ్ను 100 బాంబులు పెట్టి లేపేస్తాను అని హెచ్చరించానని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆ ప్రకటనను పాలమూరు ప్రజలు తప్పుగా తీసుకోలేదు. మాకు కూడా ఒక బాంబు వేసే మొనగాడు పుట్టిండు.. నీళ్లు వస్తాయని సంతోషపడ్డారు అని కేసీఆర్ తెలిపారు. మనం బాంబులు వేయలేదు. కానీ ఇంటి దొంగలే ప్రాణగండం అయ్యారు. ప్రాజెక్టులను అడ్డుకున్నారు. నాటి ముఖ్యమంత్రులను చూస్తే వారికి లాగులు తడిసిపోయేవి. పదవులకు భయపడి ఆనాడు సమైక్య పాలకులను ప్రశ్నించలేదు. ప్రాజెక్టులు ఎలా కడుతావు.. పాలమూరు పైన ఉన్నది కదా? అని నాటి నాయకులు ప్రశ్నించారు. నీళ్లు కిందకు లేవు వెదవా.. మీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పాను. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. పాలమూరు లిఫ్ట్ పొంగును చూస్తుంటే.. కృష్ణమ్మ తాండవం చేసినట్లు ఉంటుంది. నా ఒళ్లంతా పులకరించి పోయింది. నా జీవితం ధన్యమైంది. ఒకటే పంపు వాగు పారిన రీతిలో ఉంది. కాల్వలు కంప్లీట్ కావాలి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి. నల్లగొండలోని డిండి, మునుగోడుకు నీళ్లు ఇవ్వాలి అని కేసీఆర్ అన్నారు.