నెల రోజుల ముందు వరకు టమాటా ధరలు దిగువ, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపించాయి. టమాటా అంటేనే భయపడేలా చేశాయి. డబ్బున్న వాళ్లు కూడా టమాటా కొనడానికి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కిలో 250 రూపాయల వరకు పలికి షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగింది. టమాటా రైతులు బాగానే సొమ్ము చేసుకున్నారు. టమాటా పంట కారణంగా కొంతమంది రైతులు కోట్లు కూడా సంపాదించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ఇప్పటికే రూ.50కి దిగువకు వెళ్లిపోయింది.. హైదరాబాద్ లాంటి సిటీల్లో బహిరంగ మార్కెట్లో వంద రూపాయలకు నాలుగు కిలోల వరకు విక్రయిస్తున్నారు.. అదే హోల్సెల్ మార్కెట్లో అయితే రూ. 15, రూ. 20 దాకా దొరుకుతోంది కూడా. హైదరాబాద్లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. మరోవైపు.. ఈ రోజు హోల్సెల్ మార్కెట్లో టమాటా ధర భారీగా పడిపోయింది.. టమాటకు పెట్టిన పేరైన మదనపల్లె మార్కెట్ యార్డ్లో కేజీ టమాట రూ.8కి దిగివచ్చింది.. దీంతో, గిట్టుబాటు ధర కూడా రావడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొన్నటి వరకు టమాట పండిన రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు.. ఇప్పుడు మాత్రం గిట్టుబాటు కూడా కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.