- కాంగ్రెస్ నుంచి గెలిచి వెన్నుపోటు పొడిచాడు..
- పైలెట్ రోహిత్ కు ప్రజలే బుద్ది చెబుతారు..
- తాండూరు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి..
- కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న కొడంగల్ బిఆర్ఎస్ నేతలు..
తాండూరు గడ్డ కాంగ్రెస్కు అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠ చెబుతారని అన్నారు. గురువారం తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనివ్వనని, కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అన్నారు. తనకు కొడంగల్ ఎంతో.. తాండూరు కూడా అంతేనని అన్నారు. గజ్వేలు, సిద్దిపేటకు మాత్రమే నీళ్లు తెచ్చుకుని.. మన ప్రాంతానికి సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ముదిరాజ్లకు ఒక్క సీటైనా ఇచ్చారా?.. ముదిరాజులు ఈ రాష్ట్ర ప్రజలు కారా అని ప్రశ్నించారు. ఈటలపై కోపం ఉంటే ఇంకో ముదిరాజ్ నాయకుడికి ఇవ్వాల్సిందన్నారు. బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే మరో రెడ్డికి ఇచ్చారని విమర్శించారు. తొమ్మిది మంది అగ్రవర్ణాల వారు మంత్రులుగా ఉన్నా నేడు మరో పెద్ద రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. అసదుద్దీన్కు సీఎం కేసిఆర్ ఎం చేశారో ఏమో…. మళ్లీ కేసీఆర్ను గెలిపించేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీ, అసదుద్దీన్ అందరూ ఒక్కటేనని.. ఓటు ఎవరికేసీనా వారికేసినట్లేనని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని, చేవెళ్ళ సభను విజయ వంతం చేయడానికి అందరూ కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. ఇదిలావుంటే కొడంగల్ నుంచి బిఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నాయకులు కొడంగల్ ఎంపిపి ముద్దప్ప, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిఎం కెసిఆర్ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించడంతో సీటు రాని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ నుంచి సీటు రాని నేతలు బిజెపిలో చేరుతున్నట్టు సమాచారం. మిగతా జిల్లాలో బిఆర్ఎస్ నుంచి సీటు రానివారు కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నకిరేకల్ బిఆర్ఎస్ నేత మాజీ ఎంఎల్ఎ వేముల వీరేశం పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప్పల్ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డికి బిఆర్ఎస్ నుంచి సీటు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ రాజయ్య కూడా సీటు కేటాయించకపోవడంతో బోరున విలపించారు.