మాతృ మూర్తుల కడుపు కోతలు..

మూఢనమ్మకాలే ఆసుపత్రుల పెట్టుబడి
మంచి రోజు, తిథి, నక్షత్రాలు చూసుకుని సర్జరీలు..
అడ్వాన్స్ లు ఇచ్చి బెడ్స్ బుక్ చేసుకుంటున్న వైనం
కాసులకు కక్కుర్తి పడుతున్న డాక్టర్లు ఇష్టానుసారంగా సిజేరిన్లు
ప్రాణాల మీదకు వస్తున్నా మారని ఆసుపత్రుల,వైద్యుల తీరు
తెలంగాణలలో పెరుగుతున్న మూఢనమ్మకాల సిజేరియన్ల పై ఆదాబ్ కథనం
తెలంగాణాలో మూఢనమ్మకాలతో మాతృ మూర్తుల కడుపు కోతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంచి రోజు, తిథి, నక్షత్రాలు చూసుకుని మరీ సిజేరియన్ చేయించుకుంటున్నా శిశువు తల్లిదండ్రుల మూఢనమ్మకాలే ఆసుపత్రులకు
ప్రధాన పెట్టుబడులుగా మారి కాసుల వర్షం కురిపిస్తున్నాయి..ఎవరి పిచ్చి వారికీ ఆనందం అన్న చందంగా మారిన ఈ సందర్భాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఎంచక్కా అవకాశాలుగా మార్చుకుంటున్నాయి. సర్జరీ అవసరం లేకున్నా
కేవలం సంపాదనకే తెగపడుతున్న కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహానికి మాతృ మూర్తుల రక్తమాంసాలు పెట్టుబడిగా మారాయి.శిశువు తల్లిదండ్రులు కొన్ని రోజుల ముందే బెడ్స్ బుక్ చేసుకుని మరీ సర్జరీలకు అడ్వాన్స్ లు చెల్లిస్తున్నారు. కాసుల కక్కుర్తి కి అలవాటు పడిన కొంతమంది డాక్టర్లు అవసరం లేకున్నా సిజేరియన్లు చేసి మాతృ మూర్తుల శరీలాలను చీల్చి పారేసి ఎడాపెడా డబ్బులు సంపాదిస్తున్నారు. ముహూర్తం చూపించుకున్నారా? ఏ సమయానికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయాలి? అని అడిగి మరీ సర్జరీలు చేసేస్తున్నారు..
పిల్లలు కనాలంటే మూహూర్తం తప్పనిసరి..
ఫలానా టైమ్కి మత్తు మందు ఇవ్వాలి..ఫలానా టైమ్కి బిడ్డ బయటకు రావాలి..ముహుర్తాల పిచ్చితో సమయం, తేదీ చూసుకుని సర్జరీలు చేస్తూ స్పెషల్ డేట్స్లో ప్రసవం కోసం ఆరాటాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి.. డాక్టర్ చెప్పాడుకదా మంచి డేట్ చూసుకోమని..వినగానే ఎగిరిగంతేస్తున్న శిశువు తల్లిదండ్రులు సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేయడం మరిచిపోయారు. దీంతో ఈ అనవసరపు సర్జరీలు పెరిగి గర్భిణుల పాలిట శాపంగా మారాయి. కడుపులోని పసిగుడ్డు ఈ లోకంలోకి రావాలంటే ఆ తల్లి పురిటినొప్పులు భరించాల్సిందే. కానీ ఇప్పుడలా కాదు. అమ్మ పొట్ట కోయకుండా బిడ్డ పుట్టట్లేదు. అమ్మ కడుపుకు కోతలు తప్పట్లేదు. సిజేరియన్ లేకుండా డాక్టర్లు బిడ్డను బయటకు తీయట్లేదు. దీంతో రోజురోజుకు సాధారణ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయి. వీటికితోడు ముహుర్తాలు చూసి డెలివరీలు చేయించుకునే ట్రెండ్ కూడా బాగా పెరిగిపోయింది.
గతంలో 15 మంది సంతానము ఉన్న మాతృ మూర్తులు ఏంతో ఆరోగ్యాంగా ఉన్నారు.
కొన్నేళ్ల క్రితం ఎలాంటి కడుపుకోతలు లేవు కాని వాళ్ళు 15 మందికి మించి సంతానాన్ని పొంది కూడా చక్కటి ఆరోగ్యంతో పనులు చేసుకుని ఎక్కువ రోజులు జీవించారు.. వారికి అనారోగ్య సమస్యలు తక్కువ.. ఇప్పుడు సిజేరియన్ ద్వారా సంతానాన్ని పొందిన మహిళలు ఎక్కువగా అనారోగ్యాలపాలవుతున్నారు.. సిజేరియన్ చేయించుకున్న మహిళల్లో ఎక్కువశాతం గర్భసంచి సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యల పాలవుతున్నారు..
కొత్త వ్యాపారాలకు, శుభకార్యాలకు ముహూర్తాలు అప్పుడు ఇప్పుడు డెలివరీ కోసం కూడా ముహుర్తాలు
గృహ ప్రవేశాలకు.. పెళ్లిళ్లకు.. కొత్త వ్యాపారాలకు ముహూర్తాలు చూసుకోవడం కామన్. కానీ, కడుపులో ఉన్న బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి కూడా రోజు.. నక్షత్రం.. ముహూర్తం చూసుకుంటున్న కల్చర్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది.. చాలామంది దంపతులు పూజారుల దగ్గరకు వెళ్లి మరీ ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. ఫలానా రోజు.. ఫలానా సమయం బాగుందని పంతుళ్లు చెప్తే.. ఆ తర్వాత డాక్టర్లను కలిసి అదే సమయానికి డెలివరీ చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో నార్మల్ డెలివరీ కావాల్సిన వాళ్లకు కూడా సిజేరియన్ తప్పట్లేదు. మంచి ముహూర్తంలో పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ అందుకోసం సిజేరియన్ల వైపు మొగ్గు చూపడమే ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో వారం ముందుగానే అపరేషన్ చేయాలని వైద్యులపై శిశువు తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు.
నచ్చిన డేట్ లో అపరేషన్ లు
అపరేషన్ లు చేస్తే తల్లికి, బిడ్డకు ఆనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పినా శిశువు తల్లిదండ్రులు వినట్లేదు. సంక్రాంతి, దసరా లాంటి పండగలు.. జనవరి ఫస్ట్.. ఆగస్టు 15, గాంధీ జయంతి లాంటి ప్రత్యేక తేదీలు.. పెళ్లి రోజు, పుట్టిన రోజు అంటూ ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా తమ పిల్లల పుట్టిన రోజులు ఉండాలని కోరుకునేవారు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. ఈ పిచ్చి ఏ స్థాయికి చేరిందంటే గర్భిణికి ఎప్పుడు మత్తు ఇవ్వాలి.. ఎప్పుడు బిడ్డకు బయటకు రావాలన్న విషయాల్ని కూడా పూజారులే నిర్ణయిస్తున్నారు. ఈ పరిస్థితిపై తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసవంలో ముహూర్త బలం చూసుకోవడం కూడా ప్రైవేట్గా సిజేరియన్లు పెంచుతోందని.. దీన్ని అరికట్టేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
గర్భిణులే డిమాండ్ చేస్తున్నారు
ఒకప్పుడు గర్భం ధరించింది మొదలు.. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మహిళల్ని సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబాలు తక్కువ .. మా బిడ్డ సున్నితంగా పెరిగింది.. నొప్పులు తట్టుకోలేదంటూ తల్లిదండ్రులు.. మా ఆవిడ కష్టపడటం చూడలేనంటూ భర్తలు.. వామ్మో ఐదారు గంటలు నొప్పులు పడటం నావల్ల కాదు.. సిజేరియన్ చేయండంటూ గర్భిణులు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారంతా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు.
నెలలు నిండిన శిశువులే ఆరోగ్యంగా ఉంటారు
నెలలు నిండకున్నా.. ముహూర్తాల కోసం సిజేరియన్లు చేస్తే.. తల్లీబిడ్డలకు ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి కడుపులో కనీసం 37 వారాలు నిండిన శిశువులే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. లేదంటే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడమే గాక , ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.దీంతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని.. ఫీడింగ్ సరిగా తీసుకోలేని స్థితిలో శిశువులు ఇబ్బందులు పడతారని చెప్తున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా.. మూఢ నమ్మకాల పిచ్చిని వదిలించడం అంత ఈజీ కాదని మరికొందరు అంటున్నారు..