తగలబడి పోతున్నాయి..

- హైదరాబాద్లో దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్..
హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్ని ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో మరో స్కూటర్ అగ్నికి ఆహుతి అయ్యింది. నగరానికి చెందిన విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి డెలివరీ పార్టనర్గా పని చేస్తున్నాడు. రెండు నెలల కిందట ప్యూర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కొన్నాడు. 2022 మే 11 సాయంత్రం వేళ ఎప్పటిలాగే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పిక్ చేసుకుందామని వెళ్తుండగా ఎల్బీ నగర్ దగ్గర ఒక్కసారిగా స్కూటర్ ఆగిపోయింది.
స్కూటర్ను తిరిగి స్టార్ట్ చేసేందుకు విక్రయ్ ప్రయత్నించగా ఆన్ కాలేదు. దీంతో బ్యాటరీ స్విచ్ ఏమైనా ఆఫ్లో ఉందేమో చూద్దామని అతను బూట్ స్పేస్ ఓపెన్ చేయగానే.. అందులో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. ఆ వెంటనే మంటలు చెలరేగి స్కూటర్ అగ్నికి ఆహుతి అయ్యింది.
హైదరాబాద్కి చెందిన ప్యూర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్, విజయవాడలలో రెండు ప్రమాదాలు జరిగాయి. కాగా మరొకటి తాజాగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. స్కూటర్లలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై అప్రమత్తమైన ప్యూర్ సంస్థ ఇప్పటికే రెండు వేల స్కూటర్లకు రీకాల్ చేయాలని నిర్ణయించింది.