ఏపీ మాజీ సీఎం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి టీ మల్లికార్జున రావు తీర్పును వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ఎదుట హాజరుకావాలని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని తెలిపింది. చికిత్సకు సంబంధించి నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని కోర్టు ఆదేశించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, ఆరోగ్య కారణాలతో బెయిల్ను కోరగా.. ఇటీవల మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే.