57 రాజ్యసభ సీట్ల ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

- తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు..
- ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల..
- జూన్ 10న పోలింగ్, అదే రోజు ఫలితాలు..
- ఏపీలో ఖాళీ కానున్న 4 సీట్లు, తెలంగాణలో 2 ఖాళీ
- తెలంగాణ నుంచి ప్రచారంలో ఉన్న ప్రకాష్ రాజ్ పేరు..
హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న 57 స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా రాజ్యసభ సీట్ల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాలకు చెందిన ఈ సీట్లకు జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 24న విడుదల చేయనుంది.
ఇక ఖాళీల వివరాల్లోకెళితే... ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సహా.. బీజేపీ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్ల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్ల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకే కొత్తగా ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు గురువారం నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, 30వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్లు లెక్కింపు ప్రక్రియను చేపట్టి.. ఫలితాలు ప్రకటిస్తారు.
2018 ఏప్రిల్లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన బండ ప్రకాష్.. గతేడాది డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. బండా ప్రకాష్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో.. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు ఈసీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోసారి టీఆర్ఎస్ ఈ సీటును కైవసం చేసుకోవడం ఖాయంకాగా.. ఆ ఛాన్స్ గులాబీ బాస్ ఎవరికి ఇవ్వనున్నారోనని ఆసక్తి నెలకొంది. కొత్తగా ఎంపీగా ఎన్నికైన వారు 2024 ఏప్రిల్ వరకూ పదవిలో ఉంటారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. అయితే ఇందులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్కు ఇటీవల ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో మహారాష్ట్ర సీఎంను కలిసిన సందర్భంలోనూ ప్రకాష్ రాజ్ను తనవెంట తీసుకువెళ్లిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్కు రాజ్యసభ సీటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం.. ఢిల్లీలో జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండడంతో వినోద్ కుమార్కు కలిసి వస్తుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.